ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్నారన్న సమాచారంతో ఈ రోజు తెల్లవారుజాము నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో కొందరి ఇళ్లలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ (ఎన్ఐఏ) సోదాలు నిర్వహిస్తోంది. ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించి అందిన సమాచారం మేరకు ఏన్ఐఏ ఒక్కసారిగా ఈ దాడులు చేస్తోంది. నిజామాబాద్, కర్నూల్, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో ఈ సోదాలు కొనసాగుతున్నాయి.ఎన్ఐఏ 23 బృందాలుగా ఏర్పడి నిజామాబాద్ లో దాడులు నిర్వహిస్తోంది. కర్నూల్, కడప ప్రాంతాల్లో మరో 23 బృందాలు సోదాలు చేస్తున్నాయి. గుంటూరు జిల్లాలో రెండు బృందాలు సోదాలు చేస్తున్నాయి. ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే 28 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి 22 మందిని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.
కాగా, ముస్లిం ఉగ్రవాద సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ)కి చెందిన షాదుల్లా, మహమ్మద్ ఇమ్రాన్,మహమ్మద్ అబ్దుల్ మోబిన్లను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. వారిపై దేశ ద్రోహం కేసులు నమోదు చేశారు. కరాటే శిక్షణ, లీగల్ అవేర్నెస్ ముసుగులో వారు ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. చురుకుగా ఉండే కొంత మంది మతోన్మాదులకు మతకలహాలు సృష్టించడంలో పీఎఫ్ఐ శిక్షణ ఇస్తున్నట్లు ఎన్ఐఏ గుర్తించింది. బైంసా అల్లర్లతో వారికి ఉన్న సంబంధాలపై కూడా ఎన్ఐఏ ఆరా తీస్తోంది. కొందరు అనుమానితులకు ఎన్ఐఏ నోటీసులు జారీ చేసింది.