ఏపీలో మంత్రిపదవులు ఆశించి భంగపడిన వైసీపీ ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చాలామంది సీనియర్లు ఉన్నప్పటికి కొత్తవారికి మంత్రివర్గంలో చోటు దక్కింది. నెల్లూరు, గుంటూరు జిల్లాలో తీవ్రస్థాయిలో పలువురు ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డికి కెబినేట్ లో చోటు దక్కుతుందని అందరు భావించినా చివరికి ఆయన పేరును పరిశీలించకపోవడంతో శ్రీధర్రెడ్డి తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి వైసీపీ లో ఉన్నప్పటికి గుర్తింపు ఇవ్వకపోవడంతో ఆయన వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.
మంత్రి పదవి రాకపోవడంతో ఆయన కొంత భావోద్వేగానికి లోనయ్యారు. సీఎం జగన్ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటానని.. తన అభిమానులు, కార్యకర్తలు ఎవరు దీనిపై మాట్లాడవద్దని ఆయన తెలిపారు. మంత్రి పదవి ఆశించినప్పటికీ రాకపోవడం బాధగానే ఉందని.. అయినప్పటికి తాను రేపు గడపగడపకు వైసీపీ కార్యక్రమానికి యథావిధిగా జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు.
వైఎస్ జగన్ నిర్ణయాన్ని ధిక్కరించే వ్యక్తులు పార్టీలో లేరని ఆయన తెలిపారు. నియోజకవర్గంలో ఉన్న సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు అంతా సంయమనం పాటించాలని ఆయన కోరారు. అయితే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కార్యాలయం వద్ద కొంత ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పెద్ద ఎత్తున ఆయన అభిమానులు, కార్యకర్తలు తరలి వచ్చి శ్రీధర్రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. శ్రీధర్ రెడ్డి చెప్పినప్పటికి ఎవరు వినకుండా తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.