తెలంగాణలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా హీట్ పుట్టిస్తుంది. ఎన్నికలకు మరో ఏడాది సమయం ఉన్నా ఇప్పటి నుంచే ఎలక్షన్ హీట్ మొదలైంది. ప్రధాన ప్రతిపక్ష పార్టీలు తమ వ్యూహాలను అమలు చేస్తూ జనంలోకి వెళ్తున్నారు. బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర మహాబూబ్నగర్ జిల్లాలో కొనసాగుతుంది. ఈ సందర్భంగా జనం గోస – బీజేపీ భరోసా పేరుతో భారీ బహిరంగ సభను బీజేపీ ఏర్పాటు చేసింది. ఈ సభలో పాల్గొనేందుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణకు రానున్నారు. మధ్యాహ్నం శంషాబాద్ విమానాశ్రయంకి ఆయన చేరుకోనున్నారు. అక్కడి నుంచి నేరుగా మహబూబ్నగర్కు వెళ్లనున్నారు. మధ్యాహ్నం 3.30 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు బీజేపీ కార్యాలయంలో బేరర్స్తో జేపీ నడ్డా సమావేశం కానున్నారు.
సాయంత్రం 6గంటల నుంచి 8గంటల వరకు మహబూబ్ నగర్లో జనం గోస – బీజేపీ భరోసా పేరుతో నిర్వహించే సభలో జేపీ నడ్డా పాల్గొని ప్రసంగిస్తారు. రేపు తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటించనున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వరంగల్లో నిర్వహించే బహిరంగ సభలో రాహుల్ పాల్గొంటారు. రాహుల్ రెండు రోజుల రాష్ట్ర పర్యటనకు కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. మరోవైపు రాహుల్ గాంధీని ఓయూకి తీసుకెళ్లి నిరుద్యోగులతో మాట్లాడించాలని టీపీసీసీ నేతలు ప్రయాత్నలు చేస్తున్నారు. ఇప్పటికే ఓయూలో రాహుల్ సభకు అనుమతి ఇవ్వాలన్న పిటిషన్ను హైకోర్టు డిస్మిస్ చేసింది. తుది నిర్ణయం వీసీకే వదిలేసింది. అయితే ఓయూలో పరీక్షలు జరుగుతున్నందున శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని ఓయూ పాలకమండలి హైకోర్టు నివేదించింది. దీంతో ఓయూలో రాహుల్ సభకు వీసీ అనుమతి రాలేదు. అయినప్పటికీ టీ కాంగ్రెస్ నేతలు మాత్రం ఎట్టిపరిస్థితుల్లో రాహుల్ గాంధీని ఓయూకి తీసుకెళ్లి తీరుతామని శపథం చేస్తున్నారు.