NIA Raids – Hyderabad : ఐసిస్ రిక్రూట్మెంట్ కేసుకు సంబంధించి హైదరాబాద్ నగరంలో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) సోదాలు చేస్తోంది. ఇవాళ తెల్లవారుజామున సిటీలోని పాతబస్తీ సహా నాలుగుచోట్ల తనిఖీలు చేసింది. ఐసిస్ (ISIS) సానుభూతి పరులుగా అనుమానిస్తున్న పలువురి నివాసాల్లో సెర్చ్ నిర్వహించింది. హైదరాబాద్ లోని మలక్పేట, టోలీచౌకి ఏరియాల్లోని అనుమానితుల ఇళ్లలో సోదాలు జరిగాయి. మరోవైపు తమిళనాడులో 30 చోట్ల ఎన్ఐఏ రైడ్స్ చేసింది. చెన్నై సిటీలోని 10 ప్రాంతాలో, కోయంబత్తూరులోని 20 చోట్ల తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయి. గత ఏడాది కోయంబత్తూరులో జరిగిన కారు పేలుడు ఘటనకు సంబంధించిన కేసులో.. ఐసిస్ హస్తం ఉందనే కోణంలో జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు విచారణ చేపడుతున్నారు. డీఎంకేకు చెందిన ఒక కౌన్సిలర్ ఇంట్లోనూ సెర్చ్ జరుగుతోంది. కోయంబత్తూరులోని 82వ వార్డు మెంబర్ ఎం ముబాసీరా ఇంట్లో సోదాలు (NIA Raids – Hyderabad) చేస్తున్నారు. కోయంబత్తూరులోని కారు పేలుడు కేసుతో లింకు ఉందనే అభియోగాలను ఎదుర్కొంటున్న మొహమ్మద్ అజారుద్దిన్ ను ఇటీవల అరెస్టు చేసిన ఎన్ఐఏ అధికారులు, అతడిని త్రిసూరులోని జైలులో రిమాండ్ లో ఉంచారు.