వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. జగన్ రెడ్డికి నిజం చెప్పే అలవాటు లేదని ఆగ్రహం వ్యక్తం చేసిన లోకేష్, నిజం చెబితే తల వెయ్యి ముక్కలు అవుతుందన్న శాపం జగన్కు ఉందేమోనని నారా లోకేష్ ఎద్దేవా చేశారు. జంగారెడ్డి గూడెంలో జరిగిన నాటుసారా మరణాలను, సహజ మరణాలుగా అసెంబ్లీలో జగన్ చిత్రీకరించే ప్రయత్నం చేశారని లోకేష్ ఆరోపించారు.
నిత్యం అబద్ధాలే శ్వాసగా జగన్ బతుకుతున్నారని లోకేష్ అన్నారు. పులివెందులలో బయటపడిన నాటుసారా బట్టీల గురించి ఏం సమాధానం చెబుతారని లోకేష్ ప్రశ్నించారు. పులివెందుల నియోజకవర్గంలో 2021 నుంచి ఇప్పటి వరకు 300 కేసులు నమోదయ్యాయని, దీన్ని బట్టి పులివెందులలో నాటుసారా బట్టీలు ఎన్ని ఉన్నాయో అర్థమవుతుందన్నారు. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నియోజకవర్గంలో సారా ఏరులై పారుతోందని, ఇక రాష్ట్రంలోఅయితే సారా మరణాలకు అంతులేదని లోకేష్ వ్యాఖ్యలు చేశారు. మరి లోకేష్ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.