హైదరాబాద్ ఫలక్నుమా పోలీస్స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. నవాబ్ సాహెబ్ కుంట ప్రాంతంలో ఓ వ్యక్తిని నరికి చంపిన ఘటన సంచలనం సృష్టించింది. లైవ్ స్టాక్ చికెన్ లోడ్ డెలివరీ చేసేందుకు వెళ్లిన అయాజ్ (30)ని ఫలక్నుమాలోని ముస్తఫా మసీదు సమీపంలో గుర్తుతెలియని దుండగులు హతమార్చారు. దుండగులు ముందుగా అయాజ్ కళ్లలో కారం చల్లి అకస్మాత్తుగా అతనిపైకి దూసుకెళ్లారని స్థానిక ప్రత్యక్ష సాక్షి తెలిపారు. ఆ తరువాత పదునైన ఆయుధాలతో అతనిపై దాడి చేశారని తెలిపారు. దాడి సమయంలో అయాజ్ అక్కడికక్కడే మరణించాడు. క్లూస్ టీమ్తో పాటు ఫలక్నుమా పోలీసుల బృందం ఘటనాస్థలానికి చేరుకుంది. అయాజ్ మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. మృతుడికి నేర చరిత్ర ఉందని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. గతంలో హత్యకు ప్రతీకారం తీర్చుకునేందుకే ఈ హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. హత్య కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు