ఐదు రోజుల పసికందును విక్రయించిన తల్లితో సహా ఇద్దరు మహిళలను చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరు మహిళలు రూ.5వేలు చెల్లించి తల్లి నుంచి బిడ్డను కొనుగోలు చేశారు.
ఈ ఘటన చెన్నై శివార్లలోని సెలైయూర్లోని మప్పేడులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తల్లి పారిశుధ్య కార్మికురాలు కాగా, భర్త దినసరి కూలీ. వారికి మరో ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్యాభర్తల ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడంతో ఇద్దరు పిల్లలను పోషించడం కష్టంగా ఉందని తల్లి పోలీసులకు తెలిపింది.
అందుకే పసికందును విక్రయించినట్లు ఆమె పోలీసులకు తెలిపింది. పెళ్లయి 10 ఏళ్లు గడిచినా సంతానం లేని తన సోదరుడి కోసం బిడ్డను కొన్నామని ఇద్దరు మహిళలు తెలిపారు. |పసికందు కనిపించకుండా పోయిందని తల్లి బంధువులు గమనించడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారణ జరిపి ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. తదుపరి విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.