ప్రభుత్వాలు, పాలకులు ఎన్ని కఠిన చట్టాలు ప్రవేశపెట్టిన అమ్మాయిలపై వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా కాలేజీ అమ్మాయిల ఫొటోలను మార్ఫింగ్ చేస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. ఘట్ కేసర్ లోని విజ్ఞాన్ భారతి ఇన్స్టిట్యూషన్ కాలేజి(VBIT) లో B-Tech చదువుతున్న విద్యార్థినీల పట్ల ఆకతాయిలు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. అమ్మాయిల ఫొటోలు మార్ఫింగ్ చేస్తూ వాట్సాప్ గ్రూప్ లో క్రియేట్ చేసి ఒక్కొక్కరిగా వారిని గ్రూపులో యాడ్ చేస్తున్నారు. అంతేకాకుండా వాట్సాప్ డీపీ ఫొటోలు తీసి మార్ఫింగ్ చేసి తిరిగి వాళ్లకే పంపించి బ్లాక్ మెయిల్ చేస్తున్నారని కాలేజీ విద్యార్థినులు ఆరోపించారు.
వేధింపులు భరించలేని విద్యార్థులు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు. అయితే పోలీస్ స్టేషన్ నుంచి తిరిగు దారిలో వెళ్తుండగా తనపై కంప్లైంట్ ఇస్తారా? అంటూ మీ ఫొటోలు నెట్లో పెడతానని భయభ్రాంతులకు గురి చేస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇంత జరిగినా కాలేజీ యాజమాన్యం పట్టించుకోకపోవడంతో బాధిత విద్యార్థినులు ఆందోళన కు దిగారు.