Kavitha Slams Modi Govt: కేంద్రంపై ఎమ్మెల్సీ కవిత ఫైర్

బ్యాంకులకు వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టిన వ్యాపారవేత్తలకు లక్షల కోట్ల రుణమాపీ చేసి,

  • Written By:
  • Publish Date - August 9, 2022 / 04:15 PM IST

బ్యాంకులకు వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టిన వ్యాపారవేత్తలకు లక్షల కోట్ల రుణమాపీ చేసి, పేదలకు సంక్షేమ పథకాలు ఆపాలని కుట్ర పన్నుతున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఖరిపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. సంక్షేమ పథకాలు ఆపేందుకు కుట్రలు పన్నుతూ, కోర్టులను సైతం ఉపయోగించుకుంటున్న బీజేపీ ప్రభుత్వ తీరును దేశంలోని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని ఎమ్మెల్సీ కవిత పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉన్న ప్రభుత్వమని, పేదల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చామని కవిత తెలిపారు.

తెలంగాణలో రాష్ట్రంలో అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలను ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత గుర్తుచేశారు. “40 లక్షల మందికి ఆసరా పెన్షన్లు ఇస్తున్నాం. మరో 10 లక్షల మందికి పెన్షన్ ఇవ్వనున్నట్లు సీఎం కేసీఆర్ గారు ఇటీవలే ప్రకటించారు. 65 లక్షల రైతులకు రైతు బంధు, ప్రతి రంగంలో ఉన్న పేదవారికి ఉపయోగపడేలా తెలంగాణ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేస్తోంది. తెలంగాణ బాటలోనే అనేక రాష్ట్రాలు పథకాలు అమలు చేస్తున్నా”యని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. ‘రైతు బంధు ఆపుకోవాలా, గురుకుల విద్యను ఆపుకోవాలా, చేపలు, గొర్రెల పంపకం ఆపుకోవాలా..ఆసరా బీడీ పెన్షన్లు ఆపుకోవాలా.. ఇవన్నీ తెలంగాణ ప్రజలు ఆలోచించాల’ని కవిత పిలుపునిచ్చారు. ఉచితం అంటే ప్రజలు పేదరికం నుండి బయటపడాలని, పేద ప్రజల్లో అభ్యున్నతి రావాలని ప్రభుత్వం చేసే సహాయని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. సంక్షేమాన్ని, ఉచితాన్ని వేరుగా చూడాలని బీజేపీ ప్రభుత్వానికి ఆమె సూచించారు.

పేదలకు ఉచితాలు ఆపి, బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టిన వ్యక్తులకు రూ.10 లక్షల కోట్ల రుణమాఫీ చేసినట్లుగా కేంద్ర ప్రభుత్వమే పార్లమెంటులో ప్రకటించిన విషయాన్ని ఎమ్మెల్సీ కవిత గుర్తుచేశారు. పెద్దలకు రూ.10 లక్షల కోట్ల రుణమాఫీ చేయాలి.. కానీ పేదలకు పెన్షన్ వద్దా… అని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. తెలంగాణతో పాటు, ఇతర రాష్ట్రాల ప్రజలు కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకించకపోతే ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుదని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. విద్యుత్ సవరణ బిల్లును బీజేపీ ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశ పెట్టినప్పుడు, తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న విద్యుత్ ఉద్యోగులు సమ్మెకు పిలుపునివ్వడంతో ఆ బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి సమీక్ష కోసం పంపిందని ఎమ్మెల్సీ కవిత గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైనా నిరంకుశంగా వ్యవహరించినప్పుడు, దానిపట్ల మనకున్న వ్యతిరేకతను వ్యక్త పరిచినప్పుడే ఆ నిర్ణయాన్ని ఆపే అవకాశం ఉంటుందని అన్ని రాష్ట్రాలకు ఎమ్మెల్సీ కవిత పిలుపునిచ్చారు.