ఉక్రెయిన్లో పంజాబ్కు చెందిన ఎంబీబీఎస్ విద్యార్థి బ్రెయిన్ స్ట్రోక్తో మృతి చెందాడు . ఇస్కీమియా స్ట్రోక్తో బాధపడుతూ గత నెల రోజులుగా చికిత్స పొందుతున్న చందన్ జిందాల్ (22) బుధవారం మరణించాడు. చందన్ జిందాల్ విన్నిట్సియా నేషనల్ పిరోగోవ్ మెమోరియల్ మెడికల్ యూనివర్శిటీలో చదువుతున్నాడు. తన కొడుకు మృతదేహాన్ని భారతదేశానికి తీసుకురావడంలో సహాయం చేయమని కేంద్ర ప్రభుత్వానికి ఆయన తండ్రి శిషాన్ లేఖ రాశారు. MEA నుండి విద్యార్థి గురించి తమకు సమాచారం వచ్చిందని ఆ విద్యార్థి కుటుంబంతో టచ్లో ఉన్నామని బర్నాలా DC కుమార్ సౌరభ్ రాజ్ తెలిపారు.
బాధితుడి బంధువు నీరజ్ జిందాల్, బర్నాలా నగర్ కౌన్సిల్లో మున్సిపల్ కౌన్సిలర్ గా.. బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు కూడా ఉన్నారు. చందన్ జిందాల్ చాలా తెలివైన విద్యార్థి అని.. బర్నాలాలో 10వ తరగతి వరకు చదివి, ఆ తర్వాత ప్రీ మెడికల్ పోటీకి సిద్ధం కావడానికి కోచింగ్ కోసం చండీగఢ్ వెళ్లాడని నీరజ్ జిందాల్ తెలిపారు. నాలుగేళ్ల క్రితం మెడిసిన్ చదవడానికి ఉక్రెయిన్ వెళ్లాడని.. అతను అక్కడ కూడా బాగానే ఉన్నాడని ఆయన తెలిపారు.