అమెరికాలో కాల్పుల మోత మోగింది. మిన్నెసొటా రాష్ట్రంలోని మినియాపొలిస్ నగరంలో శుక్రవారం రాత్రి ఓ పంక్ రాక్ షోలో దుండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒకరు మృతి చెందగా.. మరో ఆరుగురు గాయపడ్డారు. అధికారుల సమాచారం ప్రకారం.. ఇద్దరు వ్యక్తులు ఈ కాల్పులకు తెగబడ్డట్టు తెలుస్తోంది. ఆ తరువాత వారు అక్కడి నుంచి పారిపోయినట్లు అధికారులు తెలిపారు. కాల్పుల్లో గాయపడ్డ వారు తమంతట తాముగా ఆసుపత్రికి చేరారు. మ్యూజిక్ షోలో పాల్గొన్న వారిని నిందితులు కావాలనే టార్గెట్ చేసుకుని ఉంటారని పోలీస్ చీఫ్ బ్రయన్ ఓ హారా మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ ఘటనలో మృతి చెందిన వ్యక్తి ఎవరనేది పోలీసులు ఇంకా గుర్తించలేదని తెలిపారు. దుండగుల కోసం పోలీసులు విసృత్తంగా గాలిస్తున్నారు.