వంట గ్యాస్ ధరల మంట ఆరడం లేదు. తాజాగా గురువారం సాధారణ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.3.50 పెరగగా, కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.8 పెరిగింది. దీంతో దేశవ్యాప్తంగా ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, కోల్ కతా, బెంగళూరు, చెన్నై సహా అన్ని నగరాల్లో గ్యాస్ సిలిండర్ ధర రూ.1000 దాటింది. గతంలో మే నెల 7వ తేదీన గ్యాస్ సిలిండర్ ధర రూ.50 పెరిగింది. దీంతో పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలు లబోదిబోమంటున్నారు.
మళ్లీ తాము కట్టెల పొయ్యి వాడే పరిస్థితి రావచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వంట గ్యాస్ ధరలను నియంత్రించాల్సిన బాధ్యతను కేంద్ర ప్రభుత్వం మరిచిందని విమర్శిస్తున్నారు. ఇప్పటికే కూరగాయలు, పాలు, పప్పుల ధరలు పెరగటంతో విలవిలలాడుతున్న ప్రజానీకంపై గ్యాస్ ధరల పెరుగుదల వార్త మూలిగే నక్కపై తాటికాయ పడిన చందంగా పరిణమిస్తోంది.