Tamil Nadu: తమిళనాడులో చిరుత కలకలం.. ఇద్దరిపై అటాక్!

తమిళనాడులోని తిరుపూర్ జిల్లాలో ముగ్గురిపై దాడి చేసిన చిరుత పులి మళ్లీ రెచ్చిపోయి, జిల్లాలోని నిట్‌వేర్ తయారీ యూనిట్ ఆవరణలో ఇద్దరు వ్యక్తులపై విరుచుకుపడింది.

Published By: HashtagU Telugu Desk
Leopard

Leopard

తమిళనాడులోని తిరుపూర్ జిల్లాలో ముగ్గురిపై దాడి చేసిన చిరుత పులి మళ్లీ రెచ్చిపోయి, జిల్లాలోని నిట్‌వేర్ తయారీ యూనిట్ ఆవరణలో ఇద్దరు వ్యక్తులపై విరుచుకుపడింది. జనవరి 24న పప్పన్‌కుళంలోని మొక్కజొన్న పొలంలో ఇద్దరు రైతులపై చిరుతపులి దాడి చేసిందని సమాచారం అందిన వెంటనే అటవీ శాఖ అధికారుల బృందం, యాంటీ-పోచింగ్ స్క్వాడ్‌తో గస్తీ కార్యకలాపాలు ప్రారంభించింది. మూడు బోనులు, 15 కెమెరాలను ఉంచినప్పటికీ, అటవీ శాఖ సిబ్బంది తమ మిషన్‌లో విఫలమయ్యారు.

అయితే, ఈ ఉదయం తిరిగి వచ్చి అమ్మపాళయంలోని తయారీ యూనిట్ ఆవరణలోకి చిరుత ప్రవేశించింది. సమాచారం తెలుసుకున్న గార్డెనర్, వాచ్‌మెన్, యాంటీ పోచింగ్ స్క్వాడ్ సభ్యుడు ప్రేమ్ కుమార్‌ అక్కడికి వెళ్లడంతో చిరుత దాడి చేసింది. పెరుమానల్లూర్ వద్ద రోడ్డు దాటుతున్న వ్యక్తిని సైతం గాయపర్చింది. దీంతో జిల్లా యంత్రాంగం, పోలీసులు ఆ ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. చిరుత దాడి చేస్తుండటంతో బయటకు వెళ్లవద్దని కోరారు. చిరుతను పట్టుకునేందుకు సంబంధిత అధికారులు మరిన్ని కెమెరాలు ఏర్పాటు చేశారు. అయితే చిరుతపులి దాడి చేసిన బావి దగ్గర సగం తిన్న పెంపుడు కుక్క మృతదేహాం కూడా ఉంది.

  Last Updated: 27 Jan 2022, 05:01 PM IST