కాంగ్రెస్ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (MP Komatireddy Venkat Reddy) మరోసారి అలకపాన్పు ఎక్కారు. పార్టీలో తనకు తగిన ప్రాధ్యానత ఇవ్వడం లేదని వెంకట్ రెడ్డి వాపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ లో నేతలు అలగడం..అధిష్టానం బుజ్జగించడం ఇవన్నీ కామన్..గత కొన్నేళ్లుగా ఈ వ్యవహారం నడుస్తున్నదే. ఇక తెలంగాణ కాంగ్రెస్ పార్టీ లో మరి ఎక్కువ. ఒకరికంటే ఒకరు ఎక్కువ..మొన్నటి వరకు జగ్గారెడ్డి అలకపాన్పు ఎక్కితే..ఇక ఇప్పుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. టీపీసీసీ అధ్యక్షుడి గా రేవంత్ (Revanthreddy) ను ప్రకటించిన దగ్గరి నుండి కూడా కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి వ్యవహార శైలి మారింది.
పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండడం..బహిరంగానే అధిష్టానం ఫై విమర్శలు చేయడం..రేవంత్ చేసే పనుల ఫై కౌంటర్లు వేయడం చేస్తూ వస్తున్నారు. ఈ మధ్య అంత సద్దుమణిగిందని అనుకున్నారో లేదో..ఇప్పుడు మరోసారి కోమటిరెడ్డి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఈరోజు జరిగిన స్క్రీనింగ్ కమిటీ (Congress Screening Committee) కీలక భేటీకి డుమ్మా కొట్టారు కోమటిరెడ్డి. ఇంత కాలం పార్టీనే తన తొలి ప్రాధాన్యతగా చెబుతూ వస్తున్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. ఇప్పుడు ఆత్మగౌరవం ముఖ్యమంటూ స్వరం మార్చడం గమనార్హం. కీలక పదవులు దక్కకపోవడం పై తీవ్ర అసహనానికి కోమటిరెడ్డి లోనైనట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఏఐసీసీ బుజ్జగింపులకు రంగంలోకి దిగింది. ఏఐసీసీ (AICC) ఆదేశానుసారం ఏసీసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ (KC Venugopal ) ఎంపీ కోమటిరెడ్డికి ఫోన్ చేసినట్టు సమాచారం. సమస్యలను అంతర్గతంగానే, సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించినట్టు తెలుస్తోంది.
అలాగే తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జి మాణిక్రావు ఠాక్రే (Manikrao Thakre).. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంటికి వెళ్తారని, అసంతృప్తిగా ఉన్న కోమటిరెడ్డి ని బుజ్జగిస్తారని తెలుస్తోంది. కోమటిరెడ్డి ఇంటికి వెళ్తున్న.. ఆయనతో భేటీ అవుతా అంటూ స్క్రీనింగ్ కమిటీ భేటీ ముగిసిన అనంతరం ఠాక్రే సైతం ప్రకటన చేశారు. అయితే కోమటిరెడ్డి స్ట్రాంగ్ లీడర్ అని, ఆయన అలగరు అని సీనియర్ నేత భట్టి చెబుతుండడం గమనార్హం.