ఏపీ మహిళలకు శుభవార్త చెప్పింది జగన్ సర్కార్. రాష్ట్రంలోని కోవిడ్ పరిస్థితులు, ఆరోగ్యశ్రీ పరిధిలోని కార్యక్రమాలు, ఆసుపత్రుల్లో నాడు నేడు పనులు, కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణం, క్యాన్సర్ కేర్ వంటి అంశాలపై ముఖ్యమంత్రి జగన్ ఈ సమీక్షలో చర్చించారు ఏ తరహా ప్రసవం జరిగినా ఆరోగ్య ఆసరా కింద తల్లికి రూ. 5వేలు అందించాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. సహజ ప్రసవం అయినా సిజేరియన్ అయినా సరే ఆరోగ్య ఆసరా వర్తింపజేయాలని స్పష్టం చేశారు. అయితే సహజ ప్రసవాల సంఖ్య పెంచాలని…ఈ దిశగా అవగాహన చైతన్యం పెంచాల్సిన అవసరం, బాధ్యత వైద్యులపై ఉందన్నారు.
కాగా ఆరోగ్యశ్రీ పథకం కిందకు మరిన్ని చికిత్సలు తీసుకునేందుకు నిర్దేశించారు. ఈ సందర్బంగా అధికారులు స్పందించారు. ఇప్పటివరకు ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా 2,446 రకాల చికిత్సలు అమల్లో ఉన్నట్లు సీఎంకు వివరించారు. ఆరోగ్యశ్రీ కార్యకలాపాల కోసం సంవత్సరానికి రూ. 4వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు సీఎంకు వివరించారు. అంతేకాదు గత ఏడాది ఆయుష్మాన్ భారత్ కింద ఏపీకి రూ. 223కోట్లు వచ్చాయని…ఈ ఏడాది రూ. 360కోట్లు రావొచ్చని ముఖ్యమంత్రి జగన్ కు వివరించారు అధికారులు.