Bengaluru Rapido Driver: ర్యాపిడో బైక్ డ్రైవర్, అతడి స్నేహితుడు కలిసి కేరళ యువతిపై సామూహిక అత్యాచారం…

బెంగళూరులో ర్యాపిడో బైక్ డ్రైవర్, అతడి స్నేహితుడు కలిసి కేరళ యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. శుక్రవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

బెంగళూరులో ర్యాపిడో బైక్ డ్రైవర్, అతడి స్నేహితుడు కలిసి కేరళ యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. శుక్రవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులకు బాధితురాలు చేసిన ఫిర్యాదు ప్రకారం శుక్రవారం రాత్రి తన ఫ్రెండ్ ఇంటికొచ్చిన యువతి అక్కడ నుంచి మరో ఫ్రెండ్‌ను కలిసేందుకు ర్యాపిడో బైక్‌ను బుక్ చేసుకుంది. అప్పటికే ఆమె ఫుల్లుగా మద్యం సేవించడం వల్ల గమ్యస్థానానికి వచ్చినా మత్తులో బైక్ దిగకపోవడంతో బైకర్ నేరుగా ఆమెను తన ఇంటికి తీసుకెళ్లాడు. తన స్నేహితుడ్ని పిలిచి ఇద్దరూ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.

మర్నాడు ఉదయం స్పృహ‌లోకి వచ్చిన యువతి భయంకరమైన నొప్పికి గురయ్యింది. దీంతో తనపై అత్యాచారం జరిగినట్టు గ్రహించింది. నిందితుడు ఇంటి నుంచి తన గదికి చేరుకుని, శరీరం సహకరించకపోవడంతో సమీపంలోని సెయింట్ జాన్స్ ఆస్పత్రికి వెళ్లింది. యువతిని పరీక్షించిన వైద్యులు అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదుచేసిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. బాధితురాలిపై అత్యాచారం జరిగే సమయంలో నిందితుడి ఇంటిలో మరో మహిళ ఉండగా ఆమెను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెను పశ్చిమ్ బెంగాల్‌కు చెందిన మహిళగా గుర్తించారు. బాధిత యువతిపై అత్యాచారం జరుగుతుంటే అడ్డుకోవాల్సింది పోయి నిందితులకు సహకరించిందని పోలీసులు తెలిపారు.

ఘటనా స్థలంలో ఎలక్ట్రానిక్స్ సిటీ పోలీసులు ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహించినట్లు బెంగళూరు కమిషనర్‌ ప్రతాప్‌రెడ్డి తెలిపారు. ‘‘యాప్‌లో భద్రత మెరుగుదలలను నిర్ధారించడానికి వాటి యాజమాన్యాలను పిలిపించి సూచనలు చేస్తాం’ అని ఆయన చెప్పారు. నిందితుల్లో ఒకరికి క్రిమినల్ రికార్డ్ ఉన్నట్లు కనిపిస్తున్నందున వారి నేపథ్యాలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారని ఆయన వివరించారు. నిందితులను షాబుద్దీన్ (26), అక్తర్ (24)గా ఆ మహిళను షాబుద్దీన్ గర్ల్‌ ఫ్రెండ్‌గా గుర్తించారు.