KCR: మహారాష్ట్రలో మరో సభకు ప్లాన్ చేస్తోన్న కేసీఆర్… ఈ సారి అక్కడే ఇక !

తెలంగాణ రాష్ట్ర సమితి, భారత సమితిగా మారినప్పటి నుంచి దూకుడుగా వెళ్తోంది. దేశ రాజకీయాల్లో కీలక భూమిక పోషించాలని నిర్ణయించుకుంది.

  • Written By:
  • Publish Date - March 14, 2023 / 10:15 PM IST

KCR: తెలంగాణ రాష్ట్ర సమితి, భారత సమితిగా మారినప్పటి నుంచి దూకుడుగా వెళ్తోంది. దేశ రాజకీయాల్లో కీలక భూమిక పోషించాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం ఈ నెల 26 న మహారాష్ట్రలోని కాందార్ లోహ లో బిఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభను నిర్వహించాలని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర నుంచి పెద్ద ఎత్తున పార్టీలో చేరికలు ఉండనున్నాయి.

బిఆర్ఎస్ పార్టీ విధానాలు, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు కేసీఆర్ దార్శనికత దేశ ప్రజలతో పాటు, రాజకీయాల్లో తలపండిన వివిధ పార్టీలకు చెందిన పలువురు సీనియర్ రాజకీయ నాయకులను ఆకట్టుకుంటున్నది. అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా యావత్ దేశ ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పే లక్ష్యంగా సాగుతున్న బిఆర్ఎస్ విధివిధానాలు నచ్చి ఇప్పటికే పలువురు సీనియర్ నాయకులు పలు రాష్ట్రాల నుంచి బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. ఇటీవలి నాందేడ్ సభ పెద్ద ఎత్తున విజయవంతమైంది.

తెలంగాణ వంటి ముఖ్యమంత్రి మాకూ ఉంటే బాగుండు అని వాళ్ళు కోరుకుంటున్న నేపథ్యంలో వారి ఆకాంక్షలకు కార్యరూపం ఇచ్చే దిశగా దేశ ప్రజలు కోరుకున్నట్టుగానే సీఎం కేసీఆర్ తెలంగాణతో పాటు యావత్ దేశ ప్రజల అభివృద్ధికి నడుం కట్టి బయలుదేరడం వారికి అందివచ్చిన అవకాశంగా మారింది. ఈ నేపథ్యంలో కేసీఆర్ వంటి గొప్ప నాయకునికి తమ సంపూర్ణ మద్దతు ప్రకటించడం ద్వారా, తమ జీవితాల్లో గుణాత్మక మార్పుకు తామే నాంది పలకాలని వారు కోరుకుంటున్నట్టుగా నాందేడ్ సభ సాక్షిగా ఇప్పటికే స్పష్టమైంది.

ఈ క్రమంలోనే మహారాష్ట్ర నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు సీనియర్లు ఆ పార్టీకి రాజీనామా చేసి బిఆర్ఎస్ లో చేరేందుకు ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర సీనియర్ రాజకీయ నాయకులు హైదరాబాదులో కేసీఆర్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ విధివిధానాలు, భవిష్యత్ కార్యాచరణ గురించి సీఎం కేసీఆర్ తో సుదీర్ఘంగా చర్చించారు. భారీ బహిరంగ సభ నేపథ్యంలో పెద్ద ఎత్తున తమ అనుచరులు, కార్యకర్తలతో పార్టీలో చేరనున్నట్లు తెలిపారు.