రాజ్యాంగాన్ని పరిరక్షించడంలో న్యాయవ్యవస్థ కీలక పాత్ర పోషిస్తోందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. విజయవాడలోని కానూరు సిద్ధార్థ కళాశాలలో దివంగత న్యాయమూర్తి లావు వెంకటేశ్వర్లు స్మారక ఉపన్యాసంలో ఎన్వి రమణ మాట్లాడుతూ యువతకు మంచి భవిష్యత్తు కోసం నాణ్యమైన విద్యనే మార్గమని జస్టిస్ లావు వెంకటేశ్వర్లు విశ్వసించారన్నారు. వెంకటేశ్వర్లు స్వగ్రామంలో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసి వాలీబాల్ తదితర క్రీడలను ప్రోత్సహించారన్నారు.
జస్టిస్ లావు వెంకటేశ్వర్లు ఆశయాలు ఆయన కుమారుడు జస్టిస్ లావు నాగేశ్వరరావుకు స్ఫూర్తినిచ్చాయని సీజేఐ అన్నారు.
భారత న్యాయవ్యవస్థ భవిష్యత్తు సవాళ్లు’ అనే అంశంపై సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ప్రసంగించారు. స్వాతంత్య్రానంతరం అభివృద్ధి, ఆధునికీకరణ, పారిశ్రామికీకరణ దిశగా పయనించడంలో సవాళ్లను ఎదుర్కొన్నామని, మన ముందు చాలా సవాళ్లు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. 1990లో భారత ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో కూరుకుపోయి, సరైన సమయంలో సరైన నిర్ణయంతో దాని నుండి బయటపడిందని.. ఆ తర్వాత కొత్త పారిశ్రామిక విధానం అమలులోకి వచ్చిందని సీజేఐ తెలిపారు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి ఆర్థిక సంస్కరణలు వచ్చాయని.. న్యాయవ్యవస్థ కూడా అనేక సవాళ్లను సమర్థంగా ఎదుర్కొని రాజ్యాంగ పరిరక్షణలో కీలకపాత్ర పోషించిందని సీజేఐ అన్నారు.