JC Prabhakar Reddy : వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నానికి తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. మహిళల గురించి మాట్లాడే అర్హత నానికి లేదని ఆరోపిస్తూ, ఆయన గత వైఖరి, వ్యవహారశైలిపై ప్రశ్నలు సంధించారు. “మహిళల పేర్లు ప్రస్తావించేటప్పుడు మీ చర్యలపై ఆలోచించారా? జేసీ కుటుంబంపై కేసులు పెట్టినప్పుడు కుటుంబం కనబడలేదు. విక్టోరియా ఎవరు? చంద్రబాబును అరెస్ట్ చేసిన అర్థరాత్రి సమయంలో కుటుంబం ఎక్కడ దాగింది?” అంటూ జేసీ మండిపడ్డారు.
అసెంబ్లీలో భువనమ్మ గురించి మాట్లాడినప్పుడు ఎవరూ స్పందించలేదని గుర్తు చేస్తూ, “పవన్ కళ్యాణ్పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడినప్పుడు కుటుంబాలు కనపడవా?” అని ప్రశ్నించారు. చంద్రబాబు మంచి మనసు వల్లే ఆయను ప్రజలు గౌరవిస్తున్నారని, కార్యకర్తలను ఆయన మంచితనంతో నడిపిస్తున్నారని అన్నారు. “చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధి కోసం పరితపిస్తున్నారు. అలాంటి నాయకుడు మరోసారి అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారు” అని జేసీ పేర్కొన్నారు.
వైసీపీ హయంపై విమర్శలు
జేసీ ప్రభాకర్ రెడ్డి వైసీపీ ప్రభుత్వ హయంపై తీవ్రమైన విమర్శలు చేశారు. “ఐదు నెలల్లోనే వైసీపీ నాయకులు బయటకు వస్తున్నారు అంటే అది చంద్రబాబు మంచితనం వల్లనే. ఆ పార్టీ పాలనలో టీడీపీ నేతలను ఇబ్బందులకు గురి చేశారు. అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్రలపై అక్రమ కేసులు పెట్టి వేధించారు. పవన్ కళ్యాణ్ను కూడా ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఆయన నిగ్రహంగా ఉన్నారు. సీఎం సైగ చేస్తే ఎవరూ మిగలరు” అని చెప్పారు.
“దొంగతనాలు చేసి ఉంటే ధైర్యంగా ఒప్పుకో. లేకపోతే ధైర్యంగా ప్రజల ముందు నిలబడాలి. నానికి ప్రెస్ మీట్లో మాట్లాడే ధైర్యం కనిపించలేదు. ఆయన ముఖంలో రక్తం చుక్క కూడా లేదు” అంటూ విమర్శించారు. “గుడివాడ నాయకులు ఎక్కడికి పోయారు? ఐదేళ్ల వైసీపీ పాలనలో టీడీపీ కార్యకర్తలను చులకన చేశారు. అలాంటి వారిని ప్రశ్నించి నిజాలను వెలికి తీయండి” అని అన్నారు.
పవన్ కళ్యాణ్పై వ్యాఖ్యలు
పవన్ కళ్యాణ్పై వైసీపీ నాయకులు చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, “డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైగ చేస్తే వైసీపీ నేతలు మిగలరని తెలుసుకోండి. పవన్ను ఆపడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ ఆయన నిబద్ధతలో చెక్కు చెదరలేదు” అని జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రశంసించారు. “వైసీపీ పాలనలో తప్పుడు మాటలు చెప్పి, ప్రజలను మోసం చేయడం సహించలేము. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వంటి నాయకులు రాష్ట్ర భవిష్యత్తు కోసం పనిచేస్తుంటే, వైసీపీ నేతలు చేసిన తప్పులను గుర్తించి ప్రజలకు నిజాలను తెలియజేయడం అవసరం” అని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు.
Plane Explosion : రన్వేపై ల్యాండ్ అవుతూ.. విమానం పేలి 179 మంది మృతి