తెలంగాణలో టీఆర్ఎస్ నేతల టార్గెట్గా ఐటీ సోదాలు జరుగుతున్నాయి. మంత్రి మల్లారెడ్డి నివాసం, కార్యాలయాల్లో ఈ రోజు (మంగళవారం) తెల్లవారుజాము నుంచి ఐటీ సోదాలు జరుగుతున్నాయి. కొంపల్లిలోని మెడోస్ విల్లాలో మాల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి ఇళ్లు, కార్యాలయాలు, కాలేజీల్లో సోదాలు నిర్వహిస్తున్నారు . సుమారు 50 బృందాలు సోదాలు నిర్వహిస్తున్నాయి.
హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, కొంపల్లి ప్రాంతాల్లో మంత్రి, ఆయన కుమారుడు మహేందర్రెడ్డి, అల్లుడు మర్రి రాజశేఖర్రెడ్డి తదితరుల ఇళ్లలో ఐటీ బృందాలు ఏకకాలంలో సోదాలు చేపట్టడం కలకలం రేపుతోంది. రాజశేఖర్ రెడ్డి అధికార టీఆర్ఎస్ పార్టీ నుంచి మల్కాజిగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అతను హైదరాబాద్ లోని పలు ఏరియాల్లో కళాశాలలను నడుపుతున్నాడు. రాజశేఖర్ రెడ్డి హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టినట్లు కూడా వార్తలు వచ్చాయి. మొత్తం 150 నుంచి 170 వరకు ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నట్టు సమాచారం.