కోల్ కతా నైట్ రైడర్స్ జట్టుకు షాక్ ఇచ్చే విషయం ఇది. ఆ జట్టు ఆల్ రౌండర్ ప్యాట్ కమిన్స్(pat cummins) ఐపీఎల్ 2022 నుంచి వైదొలిగాడు. తుంటి ఎముక గాయం కారణంగా లీగ్ను కమిన్స్ వీడినట్లు క్రికెట్ ఆస్ట్రేలియా ఒక ప్రకటనలో వెల్లడించింది. గాయం తీవ్రత తక్కువగానే ఉన్నప్పటికి వచ్చే నెలలో శ్రీలంక పర్యటన ఉన్న కారణంగా కమిన్స్ ఐపీఎల్ ను వీడినట్లు సమాచారం. ప్రస్తుతం కమిన్స్ సిడ్నీలో చికిత్స పొందుతున్నాడు. కోల్ కతా నైట్ రైడర్స్ టీమ్ ప్రస్తుతం 10 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచింది. ఇంకా, ఆ జట్టుకు ప్లే ఆఫ్ అవకాశాలు మిణుకు మిణుకు మంటున్నాయ్. మిగిలిన రెండు మ్యాచుల్లో భారీ తేడాతో గెలిచినా.. ఇతర ఫలితాలపై కేకేఆర్ భవితవ్యం ఆధారపడి ఉంది. ఇలాంటి కీలక సమయంలో కమిన్స్ దూరం కావడం కేకేఆర్ కు పెద్ద దెబ్బే. ఇప్పటివరకు కేకేఆర్ తరఫున ఐదు మ్యాచ్ లు ఆడిన కమిన్స్.. 7 వికెట్లు తీసి 63 పరుగులు చేశాడు.
ఇక ముంబైతో జరిగన మ్యాచులో 14 బంతుల్లో 56 పరుగులు సాధించి.. ఐపీఎల్ చరిత్రలోనే ఫాస్టెస్ట్ ఫిఫ్టీ చేసి కేఎల్ రాహుల్ సరసన నిలిచాడు. ఐపీఎల్ వేలంలో రూ. 7.5 కోట్లకు ప్యాట్ కమిన్స్ ను కేకేఆర్ టీమ్ దక్కించుకుంది. కాగా, కమిన్స్ కు గాయం కావడం ఆస్ట్రేలియా జట్టుకు కూడా షాకింగ్ వంటిదే. ప్రసుతం అతడు ఆస్ట్రేలియా టెస్టు జట్టుకు కెప్టెన్ గా ఉన్నాడు. ఐపీఎల్ ముగిసిన తర్వాత కంగారూలు.. శ్రీలంకతో మూడు ఫార్మాట్ల క్రికెట్ ఆడనున్నారు. మొదట టీ20, ఆ తర్వాత వన్డేలు, చివర్లో టెస్టులు జరుగుతాయి. లంకతో టి20 సిరీస్కు కమిన్స్ దూరంగా ఉండనున్నాడు. ప్రస్తుతం లంకలో ఆర్థిక సంక్షోభం కారణంగా సిరీస్ జరగడంపై అనుమానాలు ఉన్నప్పటికి.. దుబాయ్ వేదికగా ఈ సిరీస్ను నిర్వహించాలనే యోచనలో లంక క్రికెట్ బోర్డు ఉన్నట్లు తెలుస్తోంది.