Indiramma Houses: ఇందిరమ్మ ఇండ్ల కోసం చూసే సామాన్యులకు తెలంగాణ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. వచ్చే వారం నుంచి ఇందిరమ్మ ఇండ్లు (Indiramma Houses) మంజూరు కార్యక్రమం చేపట్టనున్నట్లు మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. పాలేరు నియోజకవర్గంలో పర్యటన సందర్భంగా మంత్రి పొంగులేటి ఈ మేరకు ప్రకటించారు.
వచ్చేవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. శుక్రవారం పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి మాట్లాడుతూ.. పేదవారి ప్రభుత్వం కావాలని ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకుని ఈ రోజుతో 15 నెలలు అయ్యిందని గత ప్రభుత్వ నిర్వాకం వల్ల రాష్ట్ర ఆర్దిక పరిస్ధితి అస్తవ్యస్ధంగా తయారైందని అన్నారు. అయితే తెలంగాణ ప్రజానీకానికి ఎన్నికలలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ ముందుకెళ్తున్నామన్నారు.
Also Read: ICC Player Of Month Nominees: ఐసీసీ ప్రత్యేక అవార్డుకు శుభ్మన్ గిల్ నామినేట్!
అర్హులైన వారికి అందరికీ రేషన్ కార్డులు ఇస్తామన్నారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులు బాగోలేని కారణంగా తులం బంగారం లేటవుతుందని, ఆనాటి ప్రభుత్వం అభివృద్ధి పేరుతో అరాచకం సృష్టించిందని పేర్కొన్నారు. వాటన్నింటినీ గాడిన పెడుతూ అభివృద్ధి, సంక్షేమం చేపడుతున్నామన్నారు. ఎక్కడ తగ్గకుండా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని, పేదవారి కోసం ఇందిరమ్మ ప్రభుత్వం చిత్త శుద్దితో పని చేస్తోందని స్పష్టం చేశారు. ఇచ్చిన ప్రతి మాటను.. హామీని ఆలస్యమైనా నిలబెట్టుకుంటామని మంత్రి పొంగులేటి తెలిపారు.