Scorpene Submarines : ఫ్రాన్స్- భారత్ మధ్య కీలకమైన రక్షణ రంగ డీల్ కుదిరింది.
ముంబై లోని మజగావ్ డాక్స్లో 3 స్కార్పీన్ జలాంతర్గాములను నిర్మించేందుకు రెండు దేశాల మధ్య ఎంఓయూ కుదిరింది.
ఫ్రాన్స్ తో కలిసి భారత్ లో యుద్ధ విమానాల ఇంజన్ల తయారీ, అధునాతన మిలిటరీ టెక్నాలజీల అభివృద్ధికి సంబంధించిన ఒప్పందం కూడా ఖరారైంది.
భారత ప్రధాని మోడీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ మధ్య జరిగిన శిఖరాగ్ర సమావేశం తర్వాత వీటిపై అధికారిక ప్రకటన వెలువడింది.
మోడీ-మాక్రాన్ మీటింగ్ ముగిసిన తర్వాత “హారిజన్ 2047” పేరుతో విడుదల చేసిన అధికారిక డాక్యుమెంట్ లో ఈ వివరాలు వెల్లడించారు. యుద్ధ విమానాల ఇంజన్ల తయారీ, అధునాతన ఏరో స్పేస్ టెక్నాలజీల విషయంలో ఫ్రాన్స్ కు చెందిన సఫ్రాన్ ఏరో బూస్టర్స్, భారత్ కు చెందిన DRDO కలిసి పనిచేస్తాయని అందులో తెలిపారు. ఈ ఏడాది చివరిలోగా దీనికి సంబంధించిన రోడ్ మ్యాప్ ను ఈ సంస్థలు ఖరారు చేస్తాయని పేర్కొన్నారు. ఈ సంస్థలు కలిసి భారత్ లో తయారు చేసే జెట్ ఇంజన్లను.. అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఫైటర్స్ అని పిలువబడే ఐదో తరం స్టెల్త్ యుద్ధ విమానాల్లో వినియోగించనున్నారు. ప్రస్తుతం ఈ యుద్ధ విమానాలు డెవలప్ మెంట్ స్టేజ్ లో ఉన్నాయి.
Also read : Ghee- Butter: రానున్న రోజుల్లో నెయ్యి, వెన్న ధరలు తగ్గే అవకాశం.. జీఎస్టీ కూడా..!
మూడు స్కార్పీన్ జలాంతర్గాముల(Scorpene submarines) విషయానికొస్తే.. దీనిపై ముంబైకి చెందిన మజగావ్ డాక్స్ నావల్ గ్రూప్ (MDL), ఫ్రెంచ్ నావల్ గ్రూప్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ డీల్ విలువ దాదాపు రూ. 23,000 కోట్లకు పైనే. ఫ్రెంచ్ నావల్ గ్రూప్ సహకారంతో MDLలో ఇప్పటికే ఆరు స్కార్పీన్ జలాంతర్గాములను తయారు చేశారు. 26 రాఫెల్-మెరైన్ యుద్ధ విమానాలను ఫ్రాన్స్ నుంచి భారత్ కొనుగోలు చేస్తుందని వార్తలు వచ్చినప్పటికీ దానిపై ఎలాంటి సమాచారం బయటికి రాలేదు. అయితే 80,000 కోట్ల రూపాయలతో 26 రాఫెల్-మెరైన్ జెట్లు, స్కార్పీన్ డీజిల్-ఎలక్ట్రిక్ సబ్మెరైన్ల కొనుగోళ్లకు గురువారం రోజే భారత రక్షణ శాఖ ఆమోదం తెలిపింది.