Site icon HashtagU Telugu

Kodali Nani: మేనిఫెస్టో పేరుతో చంద్రబాబు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు: కొడాలి నాని

kodali nani

kodali nani

Kodali Nani: ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల ప్రచారంలో భాగంగా గుడివాడ రూరల్ మండలం వలివర్తిపాడు గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ మేనిఫెస్టో పేరుతో చంద్రబాబు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారన్నారు. మేనిఫెస్టో తమకు సంబంధం లేదని బిజెపి తప్పుకోవడంతో.. రాష్ట్రంలో కూటమి సర్కస్ మొదలైందని కొడాలి నాని ఎద్దేవా చేశారు. 2014 మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో ఎన్ని నెరవేర్చారని ప్రశ్నించారు. రైతు రుణమాఫీ చేస్తామన్నారు చేశారా?. ఇన్ని హామీలిచ్చాం.. ఇన్ని నెరవేర్చామని చెప్పే ధైర్యం కూడా చంద్రబాబుకు లేదన్నారు. ఇద్దరు మోసగాళ్లకు పాత మేనిఫెస్టో చూపించే సత్తాలేదన్నారు. రాష్ట్రాన్ని ఉద్దరించడానికి కాదు.. అధికారం కోసమే ముగ్గురూ కలిశారని కొడాలి నాని పేర్కొన్నారు.

రాష్ట్రాన్ని బాగు చేయడానికి మేనిఫెస్టోలో ఏం పెట్టారని ప్రశ్నించారు. 2019లో నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అని తిట్టుకున్నారని.. ఇప్పుడెందుకు కలిశారని ఆయన ప్రశ్నించారు. కళకళలాడుతుండే డ్వాక్రా గ్రూపులు చంద్రబాబు మూలంగా నాశనమయ్యాయని తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఇప్పుడు మళ్లీ దొంగ హామీలతో చంద్రబాబు జనం ముందుకొస్తున్నారని మండిపడ్డారు. మేనిఫెస్టోలోని 99 శాతం హామీలను సీఎం జగన్‌ నెరవేర్చారని కొడాలి నాని తెలిపారు. నియోజకవర్గ ప్రజలు ఐదోసారి కూడా తనను ఆశీర్వదించి సీఎం జగన్ కు మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.