Site icon HashtagU Telugu

Chandrababu : సోమవారం వరకు చంద్రబాబును సీఐడీ కస్టడీకి ఇవ్వొద్దు : హైకోర్టు

Chandrababu

Babu Cid

Chandrababu : ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కేసులో సీఐడీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌పై చంద్రబాబు తరఫు న్యాయవాదులు వేసిన క్వాష్ పిటిషన్ పై విచారణను హైకోర్టు వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది. చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలంటూ విజయవాడ ఏసీబీ కోర్టులో  సీఐడీ వేసిన పిటిషన్ పై చంద్రబాబు తరఫు న్యాయవాదులు అభ్యంతరం తెలిపారు. దీంతో వచ్చే సోమవారం వరకు చంద్రబాబును సీఐడీ కస్టడీకి ఇవ్వొద్దని హైకోర్టు ఆదేశించింది. సీఐడీ వేసిన కస్టడీ పిటిషన్ కు సంబంధించిన ప్రొసీడింగ్స్ ను ఆపేయాలని విజయవాడ ఏసీబీ కోర్టుకు సూచించింది. ఇక ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అజయ్ రెడ్డితో  పాటు ఏపీ సీఐడీ వచ్చే సోమవారం లోగా కౌంటర్ పిటిషన్లు దాఖలు చేయాలని నిర్దేశించింది.

Also read : Jagan London Trip : జగన్ లండన్ టూర్ ఖర్చు ఎంతో..? ఆ డబ్బుతో ఎంతమందికి మేలు జరిగేదో తెలుసా..?

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కేసులో సీఐడీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌పై అభ్యంతరం తెలుపుతూ చంద్రబాబు తరఫు న్యాయవాదులు హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. ఇవాళ దీనిపై విచారణ జరిగింది. ఎఫ్ఐఆర్‌లో పేరు లేకున్నా.. చంద్రబాబును అరెస్ట్ చేశారని కోర్టుకు లాయర్లు తెలిపారు. చంద్రబాబుపై రిమాండ్ రిపోర్ట్‌లో ప్రస్తావించిన ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొన్నారు. రాజకీయ కక్షసాధింపులో భాగంగానే తప్పుడు కేసును బనాయించి చంద్రబాబును అరెస్ట్ చేశారని వివరించారు. ఈక్రమంలో హైకోర్టు న్యాయమూర్తి స్పందిస్తూ వెంటనే కౌంటర్లు దాఖలు చేయాలని ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఏపీ సీఐడీకి సూచించారు. అయితే వారు వెంటనే కౌంటర్లు వేయలేమని, కొంత సమయం ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరారు. దీంతో జోక్యం చేసుకున్న చంద్రబాబు తరఫు న్యాయవాదులు.. ఒకవేళ  ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఏపీ సీఐడీ త్వరగా కౌంటర్ పిటిషన్లు వేయకుంటే, చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలంటూ ఏసీబీ కోర్టులో సీఐడీ వేసిన పిటిషన్ చెల్లుబాటు అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబుకు విధించిన అరెస్టు, రిమాండ్ అక్రమమైనవని తాము వాదిస్తున్న తరుణంలో.. ఏకంగా సీఐడీ కస్టడీకి చంద్రబాబు వెళితే అన్యాయం జరిగినట్టు అవుతుందని వాదన వినిపించారు. ఈ వాదనతో ఏకీభవించిన హైకోర్టు.. సోమవారంలోగా కౌంటర్ పిటిషన్లు దాఖలు చేయాలని  ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అజయ్ రెడ్డితో  పాటు ఏపీ సీఐడీకి ఆదేశాలు జారీ చేసింది.