అగ్నిపథ్ కి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున యువకులు ఆందోళనలు చేస్తున్నారు. దీనిని నిరసిస్తూ యువకులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో రైళ్లకు నిప్పంటించారు. సికింద్రాబాద్లో ఉన్న పరిస్థితుల దృష్ట్యా రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు రైల్వే స్టేషన్లలో హైఅలెర్ట్ ప్రకటించారు. ప్రధానమైన స్టేషన్లలో రైల్వే పోలీసులు భద్రత పెంచారు. రైల్వే పరిధిలోని ఆర్పీఎఫ్, జీఆర్పీ నుంచి అదనపు బలగాలను రప్పించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు వెళ్లే పలు మార్గాలను పోలీసులు మూసివేశారు. ముందు జాగ్రత్తగా ఈ చర్యలు తీసుకున్నారు. కాచిగూడ, విజయవాడ, వరంగల్, తిరుపతి, కడప, విశాఖపట్నం తదితర రైల్వేస్టేషన్లలో భద్రత పెంచారు. గుంటూరు, నరసరావుపేట, బాపట్ల రైల్వేస్టేషన్లలోనూ అదనపు బలగాలను ఏర్పాటు చేశారు. అక్కడి పరిస్థితిని పోలీసు ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. రైల్వేస్టేషన్ పరిసరాల్లో ఎవరూ గుమిగూడకుండా చర్యలు చేపట్టారు. ముందుజాగ్రత్తగా స్టేషన్ల వద్ద పోలీసులు మోహరించారు. తిరుపతి రైల్వేస్టేషన్ వద్ద రెండు ప్రవేశద్వారాలను మూసివేశారు.