నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతూ గంటకు 25 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ దిశగా కదులుతోంది. ఈ రోజు (మంగళవారం) పశ్చిమ దిశలో పయనించి దక్షిణ కోస్తా ఆంధ్ర, ఉత్తర తమిళనాడు వైపు కదులుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. మంగళవారం ఉదయం అల్పపీడనంగా బలహీనపడి దక్షిణ ఆంధ్ర, తమిళనాడు, పుదుచ్చేరి మధ్య తీరం దాటే అవకాశం ఉందని చెబుతున్నారు. దీని ప్రభావంతో మంగళ, బుధవారాల్లో దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో కొన్ని చోట్ల, ఉత్తర కోస్తాంధ్రలో ఒకటి రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా కనిష్ట ఉష్ణోగ్రతలు మరింత తగ్గుముఖం పట్టాయి.