హైదరాబాద్ నగరంలో రెండు రోజులుగా కాస్త వర్షం తగ్గుముఖం పట్టింది. అయితే ఈ రోజు సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. భారీ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రజలు అనవసర ప్రయాణాలకు దూరంగా ఉండాలని, అవసరమైతే మాత్రమే బయట అడుగు పెట్టాలని అధికారులు కోరారు. ఉద్యోగస్తులు ఆఫీసుల నుంచి ఇంటికి వచ్చే సమయం కావడంతో పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. జీహెచ్ఎంసీ పరిధిలో Drf బృందాలు అప్రమత్తంగా ఉన్నారని.. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో సహాయం కోసం 040-21111111 లేదా 9000113667కు డయల్ చేయవచ్చని GHMC డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ & డిజాస్టర్ మేనేజ్మెంట్ ట్వీట్టర్లో తెలిపింది. భారీ వర్షం కారణంగా పంజాగుట్ట, సైఫాబాద్, మలక్పేట, చాదర్గట్, బంజారాహిల్స్ తదితర ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.