Site icon HashtagU Telugu

HC Directs: రాహుల్ గాంధీ పర్యటనపై పునరాలోచన చేయండి!

Rahul

Rahul

రాహుల్ గాంధీ పర్యటనపై ఉస్మానియా యూనివర్శిటీ పాలకవర్గం, విద్యార్థి కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో, విద్యార్థులు దాఖలు చేసిన అప్పీల్‌ను పునఃపరిశీలించాలని, కాంగ్రెస్ చీఫ్ పర్యటనకు అనుమతించాలని, వీసీదే తుది నిర్ణయమని తెలంగాణ హైకోర్టు ఓయూ వైస్ ఛాన్సలర్‌ను ఆదేశించింది. అవసరమైతే ఏదైనా ఆదేశాలు జారీ చేయాలని వీసీని కోరింది. ఇటీవల కళాశాల ప్రాంగణంలో ఎటువంటి రాజకీయ సభలు, సమావేశాలను అనుమతించబోమని యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ పేర్కొన్న విషయం తెలిసిందే. పరోక్షంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటనకు అనుమతి ఇవ్వమని చెప్పింది.

ఈ సభకు రాజకీయ నేపథ్యం ఉండదని విద్యార్థి కార్యకర్తలు పేర్కొంటున్నప్పటికీ, సభను నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సుముఖంగా లేదు. గొడవ మరింత ముదిరడంతో విద్యార్థి జేఏసీ (జాయింట్ యాక్షన్ కమిటీ), నిరుద్యోగ యువజన సంఘాల నాయకుడు కె మానవతా రాయ్, మరో ముగ్గురితో కలిసి హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. రాహుల్ గాంధీ పర్యటనకు అనుమతి ఇవ్వాలని ఆందోళన చేసిన నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (NSUI), కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగానికి చెందిన 16 మంది విద్యార్థి కార్యకర్తలను అరెస్టు చేసి 14 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపారు. చట్టవిరుద్ధంగా గుమిగూడడం, దాడి చేయడం, అల్లర్లు చేయడం, అతిక్రమించడం, ప్రభుత్వ ఉద్యోగులను వారి విధులను నిర్వర్తించకుండా నిరోధించడం వంటి నేరాలకు వారిపై కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ పర్యటనకు హైకోర్టు సానుకూలంగా స్పందించడంతో కాంగ్రెస్ కార్యకర్తల్లో ఆనందం నింపినట్టయింది.