పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ విద్యత్ కోతలపై తెలంగాణ మంత్రి హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో విద్యుత్ సరఫరాను..ఏపీలో విద్యుత్ కోతలతో హారీశ్ రావు పోల్చారు. ఆంధ్రప్రదేశ్ తో పోలిస్తే…తెలంగాణలో రెప్పపాటుకూడా కరెంటు పోవడంలేదన్నారు. దీంతో హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిగ్గా మారాయి. ప్రతి విషయంలోనూ తామే గ్రేట్ అని చెప్పుకునేందుకు ఆంధ్రప్రదేశ్ తో పోల్చడం తెలంగాణ మంత్రులగా అలవాటుగా మారిందన్న చర్చ జోరుగా సాగుతోంది.
తాను తిరుమలలో పర్యటించినప్పుడు…అక్కడ దర్శనానికి వచ్చిన వారిని అడిగితే…కరెంటు కోతల విషయం బయటపడిందని హరీశ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో 6గంటలపాటు కరెంటు కోతలు ఉన్నాయన్నారు. ఉదయం 3 గంటలు, సాయంత్రం 3 గంటలు కరెంటు పోతుందన్నారు. దీంతో అక్కడి రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు హరీశ్ రావు తెలిపారు.
కాగా గతంలో ఏపీలో రోడ్ల దుస్తితిపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. వైసీపీ మంత్రులు, సలహాదారులు అంతా తీవ్రంగా స్పందించారు. కేటీఆర్ ను 24 గంటల్లో క్షమాపణ చెప్పించేశారు. ఇప్పుడు హరీశ్ వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు ఇంకా స్పందించలేదు. ఎన్నికల వేళ టీఆరెస్ మంత్రులు చేస్తోన్న వ్యాఖ్యలు అధికార వైసీపీకి తలనొప్పిగా మారుతున్నాయి.