మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఇంటి ముందు హనుమాన్ చాలీసా పారాయణం చేస్తామంటూ నవనీత్ కౌర్, ఆమె భర్త రవి రాణా ఇటీవల చేసిన వ్యాఖ్యలతో ఉద్రిక్తత చోటు చేసుకొంది. ఈనేపథ్యంలో నవనీత్ కౌర్ ఇంటి ఎదుట శివసేన కార్యకర్తలు ఆందోళనలు చేశారు. మరోవైపు పోలీసులు కూడా నవనీత్ కౌర్ ,రవి రాణా వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్నారు. వారు మాట్లాడిన మాటలు రెండు వర్గాల ప్రజల మధ్య శత్రుత్వాన్ని పెంచేలా ఉన్నాయని ఆరోపిస్తూ.. శనివారం నవనీత్ కౌర్ తో పాటు ఆమె భర్త రవి రాణాను అరెస్ట్ చేశారు.
ఎంపీ నవనీత్ కౌర్, ఎమ్మెల్యే రవి రాణాలపై దేశద్రోహం కేసు నమోదు చేశారు.ఆదివారం ఉదయం ముంబై బాంద్రాలోని కోర్టులో వారిని హాజరుపర్చారు. నాయస్థానం వీరిద్దరికి మే 6 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. అయితే నవనీత్ కౌర్, ఆమె భర్త రవి రాణాలను తమ కస్టడీకి ఇవ్వాలంటూ బాంద్రా కోర్టులో పోలీసులు కస్టడీ పిటిషన్ వేశారు. అయితే ఈ పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది. వీరిద్దరి బెయిల్ పిటిషన్లపై ఈ నెల 29న కోర్టు విచారించనుంది.