టీనేజ్ లో ముఖంపై మొటిమలు రావడం సహజం. ఒక వయస్సు వచ్చాక అవి మాయం అవుతాయి. కానీ కొందరిలో వారీ శరీరతత్వాలను బట్టి ఎక్కువకాలం ఉంటాయి. ఇంకొందరిలో ఎక్కువకాలంపై ముఖంపై మొటిమలు కనిపిస్తుంటాయి. మొటిమలు మాయం అయ్యేందుకు మార్కెట్లో ఉన్న ఎన్నో ఉత్పత్తులను వాడుతుంటారు. ఎన్నో విధాల చికిత్సలు కూడా అందుబాటులో ఉన్నాయి. అయినా కూడా చాలా మంది ఈ మొటిమల వల్ల బాధపడుతుంటారు. ముఖ్యంగా అమ్మాయిల బాధ అయితే వర్ణాతీతం. ఇంత వరకు సహజమే. కానీ మొటిమలు పోవట్లేదని ఆత్మహత్య చేసుకున్న ఘటన వింటే షాక్ అవుతారు. అవును ఉత్తరప్రదేశ్ లో ఇలాంటి ఘటనే జరిగింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే…ఉత్తరప్రదేశ్ కు చెందిన బందా జిల్లాలో ఓ యువతి మొటిమల సమస్యతో బాధపడుతుంది. వాటిని ఎలాగైనా తగ్గించుకోవాలని చేయని ప్రయత్నాలంటూ లేవు. పలు రకాల చికత్సలు కూడా చేయించుకుంది. కానీ మొటిమలు పోలేదు. ఈ మొటిమల కారణంగా ఆమె తన మిత్రుల నుంచి చదువుకునే చోట కూడా చిన్నచూపు ఎదుర్కొంది. అవన్నీ ఒకఎత్తయితే…పెళ్లి చూపులు మొటిమల కారణంగానే విఫలమయ్యాయని చాలా బాధపడింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైంది. ఈ సమస్య కారణంగానే ఆమె ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సోమవారం సాయంత్రం బిసందా పోలీసు సర్కిల్లోకి వచ్చే అజిత్ పారా గ్రామంలో ఈ ఘటన జరిగింది.