సామాన్య ప్రజలను ఏ ఒక్కటి ఊపిరి పీల్చుకోనివ్వడం లేదు. ఒకటి కాకపోతే ఒకటి ధరలు ఆకాశానికి తాకుతున్నాయి. మొన్నటి వరకు టమాటా ధర నిద్ర పోనివ్వకుండా చేయగా..ఇక ఇప్పుడు సాధారణ ధర కు వచ్చాయని హమ్మయ్య అనుకున్నారో లేదో..ఇప్పుడు అల్లం (Ginger) , వెల్లుల్లి (Garlic ) , ఉల్లి (Onion ) ధరలు ఆకాశానికి తాకుతున్నాయి. ఉల్లి ధరలు కేజీ రూ.40 లకు చేరగా..అల్లం కేజీ రూ. 350 పలుకుతుంది. వెల్లుల్లి కూడా నేనేమన్నా తక్కువ అన్నట్లు కేజీ రూ. 250 పలుకుతుంది. ఇలా అన్ని కూడా రోజు రోజుకు పెరగడమే తప్ప తగ్గేదెలా అంటున్నాయి. మార్కెట్ లో వీటి ధరలు చూసి సామాన్య ప్రజలు గగ్గోలు పెడుతున్నారు.
వేసవిలో అకాల వర్షాలు కురవడంతో అప్పట్లో అల్లం, వెల్లుల్లి పంటలను రైతులు కోయలేదు. ఇప్పుడు కోద్దామంటే వానలు పడుతున్నాయి. వర్షాల సమయంలో పంటలు కోస్తే పాడైపోతాయని.. అందుకే రైతులు వేచి చూస్తున్నారని వ్యాపారులు చెబుతున్నారు. అల్లం, వెల్లుల్లి దిగుబడులు తగ్గడం వల్లే ధర పెరిగిందని చెప్పుకొస్తున్నారు. అల్లం,వెల్లుల్లి విక్రయాలకు విజయవాడ పెట్టింది పేరు. ఇక్కడ నుంచే ఉభయ తెలుగు రాష్ట్రాలకు సప్లై అవుతాయి. కానీ ధరలు చూస్తే భగ్గుమంటున్నాయి. ఏప్రిల్ లో కిలో అల్లం రూ. 80 రూపాయలు ఉండగా.. వెల్లుల్లి రూ. 50 రూపాయలు పలికింది. మేలో అల్లం రూ. 150 కాగా, వెల్లుల్లి రూ.80 కి చేరింది. జూన్లో అల్లం 180, వెల్లుల్లి రూ.120 లకు చేరుకుంది. జూలైలో అల్లం 200 ఉండగా.. ప్రస్తుతం రూ. 280 లకు చేరుకుంది. అటు వెల్లుల్లి సైతం రూ. 200 లకు పైగా ఎగబాకడం విశేషం. రాబోయే రోజుల్లో వీటి ధర మరింతగా పెరగనుందని అంటున్నారు. ఇంత ధరలు పెట్టి ఎలా కొనుగోలు చేయాలనీ సామాన్య ప్రజలు అంటున్నారు.
Read Also : Rape : ప్రకాశం జిల్లాలో 13 ఏళ్ల బాలిక ను హత్యాచారం చేసి..చంపేశారు