ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో చాలామంది తెలుగువాళ్లు ఇబ్బందులకు గురవుతున్నారు. ఉక్రెయిన్ నుంచి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకుని అక్కడి నుంచి వారి స్వస్థలాలకు వెళ్లేందుకు టీఎస్ ఆర్టీసీ ఉచిత బస్సులు ఏర్పాటు చేసింది. ఎయిర్పోర్ట్ నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే విద్యార్థులకు ఉచిత బస్సు సేవలను అందించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.
రష్యా యుద్దంతో ఉక్రెయిన్ గగనతలాన్ని మూసివేసిన అనంతరం వందలాది మంది భారతీయ విద్యార్థులు ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఉక్రెయిన్ నుండి తిరిగి వచ్చిన విద్యార్థులకు టిఎస్ఆర్టిసి ఉచిత టిక్కెట్లను అందిస్తోంది. విద్యార్థుల సహాయార్థం న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్లో కంట్రోల్ రూమ్లను కూడా ఏర్పాటు చేశారు. ఉక్రెయిన్లోని విద్యార్థులందరూ స్వగ్రామానికి చేరుకునే వరకు ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుందని టీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ తెలిపారు.