టపాసుల దుకాణంలో అగ్ని ప్రమాదం కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. షాప్ యజమానులు గోపాలకృష్ణ, గోవింద రాజులు, టపాసుల పరిమితికి మించి సప్లయ్ చేసిన కిషోర్, రామాంజనేయులను అరెస్ట్ చేసినట్లు విజయవాడ ఏడీసీపీ కొల్లు శ్రీనివాసరావు తెలిపారు. ఉల్లిపాయల బాంబుల బస్తా కిందపడి ఒత్తిడికి గురవటం వల్ల అవి పేలి మంటలు అంటుకున్నాయని తెలిపారు. ప్రమాద సమయంలో 10 వేల చిచ్చు బడ్లు, 25 కిలోల మతాబులకు మంటలు అంటుకున్నాయని దర్యాప్తులో గుర్తించినట్లు ఏడీసీపీ తెలిపారు. అనుమతి ఇచ్చిన వాటికి మించి టపాసులు తీసుకురావడంతో ఈ ప్రమాదం జరిగిందని.. ఏ సంవత్సరం టపాసులు ఆ సంవత్సరం విక్రయించాలని తెలిపారు. లైసెన్స్ లేకుండా టపాసులు నిల్వ ఉంచిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విజయవాడలో త్వరలో పూర్తి స్ధాయిలో టపాసులు గౌడన్లపై తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు.