ఛత్తీస్గఢ్లోని (Chhattisgarh) సుర్గుజా జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం జరిగింది. ప్రత్యేక నియోనాటల్ కేర్ యూనిట్ (SNCU)లో అప్పుడే పుట్టిన నలుగురు నవజాత శిశువులు మరణించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించినట్లు అధికారి తెలిపారు. రాజధాని రాయ్పూర్కు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న అంబికాపూర్లోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రి (జిఎంసిహెచ్)లో ఉదయం 5.30 నుండి 8.30 గంటల మధ్య మరణాలు జరిగాయని కలెక్టర్ కుందన్ కుమార్ మీడియాకు తెలిపారు.
మరణించిన శిశువుల్లో ఇద్దరు వెంటిలేటర్ సపోర్టుపై ఉన్న ఆసుపత్రిలో విద్యుత్తు అంతరాయం కారణంగా మరణించారని బంధువులు పేర్కొన్నప్పటికీ, మరణాలకు విద్యుత్తు కోతతో సంబంధం లేదని ఆస్పత్రి వర్గాలు తెలుపుతున్నాయి. అయితే ఆస్పత్రిలో అర్ధరాత్రి ఒంటి గంట నుంచి 1.30 గంటల మధ్య విద్యుత్ సరఫరాలో హెచ్చుతగ్గులు చోటుచేసుకోగా, కొద్దిసేపటికే సరిచేశారు. ప్రత్యామ్నాయ విద్యుత్ సరఫరా ఉంది. SNCUలో కనీసం 30 నుండి 35 మంది పిల్లలు చికిత్స పొందుతున్నారని అధికారి వివరించారు.
ఈ విషయంపై సమగ్ర దర్యాప్తు జరుగుతోందని, దీని తరువాత మరణాలకు ఖచ్చితమైన కారణం తెలుస్తుందని, నలుగురు శిశువుల (New born) వైద్య నివేదికను త్వరలో ఆసుపత్రి నుండి విడుదల చేస్తామని సంబంధిత అధికారి చెప్పారు. మరోవైపు, ఘటనపై విచారణకు బృందాన్ని ఏర్పాటు చేయాలని ఛత్తీస్ గడ్ (Chhattisgarh) రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి టీఎస్ సింగ్ డియో ఆరోగ్య కార్యదర్శిని ఆదేశించారు. ప్రస్తుతం ఈ ఘటన పై పిల్లల తల్లిదండ్రులు, ప్రజలు ప్రభుత్వంపై మండిపడుతున్నారు.
Also Read: SI kidnapped: మగ ఎస్ఐ ను కిడ్నాప్ చేసిన లేడీ కానిస్టేబుల్స్.. ఏం జరిగిందంటే!