పరకాల నియోజకవర్గంలో రాజకీయం కాక రేపుతుంది. హనుమకొండ జిల్లా ఆత్మకూర్ మండల పరిధిలోని ఆగ్రాం పహాడ్లోని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి తల్లిదండ్రుల స్మారక చిహ్నాన్ని శనివారం టీఆర్ఎస్ కార్యకర్తలు ధ్వంసం చేశారు. ఆగ్రాం పహాడ్ జాతరకు వచ్చే భక్తులకు అడ్డంకిగా ఉందని, స్మారక చిహ్నాన్ని కూల్చివేయాలని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తన కార్యకర్తలకు చెప్పినట్లు సమాచారం. కొండా చెన్నమ్మ, కొమురయ్య స్మారక స్థూపాన్ని కొండా సురేఖ 2010లో పరకాల ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నిర్మించారని, ఆమె కుమార్తె సుస్మిత స్మారక స్థూపం కోసం భూమిని విరాళంగా ఇచ్చారని ఇక్కడ గుర్తు చేశారు.ఈ ఘటనపై సమాచారం అందుకున్న కొండా సురేఖ, సుస్మిత ఆగ్రాం పహాడ్ గ్రామాన్ని సందర్శించారు.
చల్లా ధర్మారెడ్డికి తీవ్ర పరిణామాలుంటాయని మాజీ మంత్రి కొండా సురేఖ హెచ్చరించారు. విగ్రహాలు కూల్చడానికి ధర్మారెడ్డికి ఏ హక్కు వచ్చింది’ అంటూ ఆమె ప్రశ్నించారు. గతంలో కూడా ధర్మారెడ్డి కూల్చివేసేందుకు ప్రయత్నించారని.. అయితే అలా చేయవద్దని అప్పటి కలెక్టర్ వాకాటి కరుణ హెచ్చరించారని ఆమె తెలిపారు. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి క్షమాపణలు చెప్పడంతో పాటు స్మారక చిహ్నాన్ని పునరుద్ధరించాలని కొండా సురేఖ కూతురు సుస్మిత డిమాండ్ చేశారు. పెద్ద సంఖ్యలో కొండా అనుచరులు ధర్మారెడ్డికి, టీఆర్ఎస్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.