ప్రస్తుతం దేశం ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈసారి ఎలాగైనా పుంజుకొని, కేంద్రంలో అధికారం చేపట్టాలని భావిస్తున్న కాంగ్రెస్కు వరుసగా భారీ షాక్లు తగులుతున్నాయి. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ, పలువురు కీలక నేతలు హస్తానికి హ్యాండ్ ఇస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశ్వనీ కుమార్ తాజాగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. దీంతో కాంగ్రెస్తో అశ్వనీ కుమార్కు ఉన్న 46 ఏళ్ళ బంధం తెగిపోయింది.
ఇక తన రాజీనామా లేఖను అశ్వినీ కుమార్, కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి పంపారు. ఈ సందర్భంగా మీడియా ముందుకు వచ్చిన అశ్వనీ కుమార్, కాంగ్రెస్ పార్టీపై కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులోమరింతగా దిగజారే అవకాశం ఉందని అశ్వనీ కుమార్ అన్నారు. రాహుల్ గాంధీకి దేశ ప్రజల ఆమోదం లభించడం లేదని, ఒకవైపు ప్రధాని నరేంద్ర మోదీ పనితీరుపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉన్నా, కాంగ్రెస్కు మాత్రం ఓటు వేయడంలేదన్నారు. కాంగ్రెస్ అధిష్టానం పై చాలామంది సీనియర్ నేతలు అసంతృప్తిగా ఉన్నారని, పార్టీలో వారికి వరుస అవమానాలు ఎదురవుతున్న నేపధ్యంలో వాళ్ళు కూడా పార్టీ నుంచి బయటకు వచ్చే అవకాశం ఉందని అశ్వనీ కుమార్ వ్యాఖ్యలు చేశారు.
