Assam Flood : అస్సాంను వర్షాలు, వరదలు ముంచెత్తుతున్నాయి.
వరదల ఉధృతికి 10 జిల్లాల్లోని అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి.
37,000 మందికి పైగా ప్రజలు ప్రభావితమయ్యారు.
కొండచరియలు విరిగిపడి ఒకరు, ఇంటిగోడ కూలి మరొకరు మృతిచెందారు.
అస్సాంలోని జోర్హాట్ జిల్లాలో ఉన్న నిమ్తి ఘాట్ వద్ద బ్రహ్మపుత్ర నది ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తోంది. కామ్పూర్ (నాగావ్)లోని కోపిలి, కామ్రూప్ జిల్లాలోని పుతిమరిలో కూడా నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. అనేక రోడ్లు, వంతెనలు, పాఠశాలలు వరదల్లో(Assam Flood) మునిగిపోయాయి. వివిధ ప్రాంతాల్లో భూమి కోత కూడా పెద్ద ఎత్తున జరిగింది. రాష్ట్రంలోని లఖింపూర్లో అత్యధికంగా 25,200 మందికి పైగా ప్రజలు ప్రభావితమయ్యారు. దిబ్రూఘర్ లో 3,800 మంది, టిన్సుకియా లో దాదాపు 2,700 మంది వరదలతో ఎఫెక్ట్ అయ్యారు. ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి తాత్కాలిక ఆశ్రయం కల్పిస్తున్నారు.
Also read : Liquid Cocaine : లిక్విడ్ కొకైన్ స్మగ్లింగ్.. కూల్ డ్రింక్స్ సీసాలు, షాంపూ బాటిల్స్ లో నింపి..
దిగువ అస్సాంలోని కోక్రాఝర్, చిరాంగ్, బక్సా, బార్పేట, బొంగైగావ్ జిల్లాలతో పాటు ధుబ్రి, కమ్రూప్, కమ్రూప్ మెట్రోపాలిటన్, నల్బారి, డిమా హసావో, కాచర్, గోల్పరా, కరీంనగర్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం పేర్కొంది. అస్సాం స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (ASDMA) రోజువారీ నివేదిక ప్రకారం.. కాచర్, దర్రాంగ్, ధేమాజీ, డిబ్రూగర్, గోలాఘాట్, హోజై, లఖింపూర్, నాగావ్, నల్బరి, సోనిత్పూర్, టిన్సుకియా, ఉదల్గురి జిల్లాలలో వరదల కారణంగా 37,400 మందికి పైగా ప్రజలు ప్రభావితులయ్యారు.
గౌహతిలోని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అస్సాంకు ‘రెడ్ అలర్ట్’ జారీ చేసింది. జూన్ 22 (గురువారం) వరకు అస్సాంలోని పలు జిల్లాల్లో ‘అతి భారీ’ నుంచి ‘అత్యంత భారీ’ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. భారీ వర్షం అంటే 24 గంటల్లో 7 నుంచి 11 సెం.మీ.. అతి భారీ వర్షం అంటే 24 గంటల్లో 11 నుంచి 20 సెం.మీ, అత్యంత భారీ వర్షపాతం అంటే 24 గంటల్లో 20 సెం.మీ కంటే ఎక్కువ వాన కురవడం.