గుంటూరు అరండల్ పేటలోని బోరుగడ్డ అనిల్ కుమార్ క్యాంపు కార్యాలయానికి అర్థరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. ఎవరూ లేని సమయంలో ఆరుగురు వ్యక్తులు కార్యాలయానికి వచ్చి ఆవరణలో పెట్రోల్ పోసి నిప్పంటించారని వాచ్మెన్ తెలిపాడు. అగ్ని ప్రమాదంలో కార్యాలయంలోని ఫర్నీచర్ పూర్తిగా దహనమైంది.ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి మంటలను అదుపు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఏపీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్న బోరుగడ్డ అనిల్ కుమార్ ఈ దాడికి సంబంధించి పలువురిపై అనుమానం వ్యక్తం చేశారు. ఇటీవల వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఫోన్ చేసి అనిల్ బెదిరించినట్లు వాయిస్ రికార్డ్ బయటకు వచ్చింది. ఈ నేపథ్యంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అనుచరులు ఈ దాడికి పాల్పడినట్లు అనిల్ అనుచరులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.