తెలంగాణ అసెంబ్లీలో ఈరోజు సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనతో, ఏళ్ళుగా ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిరుద్యోగులపై వరాల జల్లు కురిపిస్తూ కేసీఆర్ నుండి ప్రకటన రాగానే, రాష్ట్ర వ్యాప్తంగా సంబురాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర యువత, నిరుద్యోగులు ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
ఇక అసెంబ్లీ లో 80వేలకు పైగా ఉద్యోగాల నోటిఫికేషన్ ప్రకటన రావడంతో, ఉస్మానియా యూనివర్సిటీలోని టీఆర్ఎస్వీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. ఓయూలో విద్యార్థులు రోడ్లపైకి వచ్చి బాణా సంచా కాల్చుతూ, ఓయూ రోడ్లపై పరుగులు తీస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేస్తున్నారు. కేసీఆర్ జాబ్ నోటిఫికేషన్ ప్రకటనతో తెలంగాణ భవన్ హోరెత్తింది. అక్కడ టీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు తెలంగాణ భవన్ ఎదుట సంబరాలు నిర్వహించారు. జయహో కేసీఆర్ అంటూ కార్యకర్తలు నినాదాలతో వేడుకలు నిర్వహించారు. ఈ క్రమంలో నిరుద్యోగ బంధు కేసీఆర్ అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడమే కాకుండా, కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.