AP RTC:స్పెష‌ల్ బ‌స్సుల్లో అద‌న‌పు ఛార్జీలు అందుకే… స్ప‌ష్ట‌త‌నిచ్చిన ఆర్టీసీ ఎండీ

సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రకటించిన ప్రత్యేక బస్సులపై అదనపు చార్జీలపై ఆందోళనలపై ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు స్పందించారు.

Published By: HashtagU Telugu Desk
APSRTC

APSRTC

సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రకటించిన ప్రత్యేక బస్సులపై అదనపు చార్జీలపై ఆందోళనలపై ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు స్పందించారు. డీజిల్‌ రేటు 60% పెరిగిందని, బస్సు తిరిగేటప్పుడు ఖాళీగా నడుస్తుందని, అందుకే టికెట్‌ చార్జీలను 50% పెంచామని చెప్పారు. ప్రజలు అర్థం చేసుకుని ప్రభుత్వానికి సహకరించాల‌ని ఆయ‌న కోరారు. తెలంగాణ‌, కర్ణాటక రాష్ట్రాల నుంచి ప్రతిరోజూ నాలుగు వేల బస్సులు వస్తాయని, శుక్రవారం నుంచి జనవరి 18 వరకు 6970 అదనపు బస్సులు నడిపేందుకు సిద్ధంగా ఉన్నాయని ఎండీ తెలిపారు.

ప్రత్యేక బస్సుల్లో తొమ్మిది సిరీస్‌లు ఉంటాయని, ఇప్పటి వరకు 60% రెగ్యులర్‌ సర్వీసులు, 50% ప్రత్యేక బస్సులు రిజర్వ్‌ చేశామని ఆయన స్పష్టం చేశారు. ప్రయాణికుల సంఖ్య ఆధారంగా ఆయా బోర్డింగ్ స్టేషన్లలో బస్సులు ఆగుతాయని ఆర్టీసీ ఎండీ తెలిపారు. జనవరి 8 నుంచి 14 వరకు హైదరాబాద్‌కు 1,500, విశాఖపట్నంకు 650, విజయవాడకు 250, బెంగళూరుకు 100, చెన్నైకి 45 బస్సు సర్వీసులతో 4,145 ప్రత్యేక సర్వీసులు నడపనున్న సంగతి తెలిసిందే. మిగిలిన 1,600 సర్వీసులను అన్ని జిల్లా కేంద్రాలతో పాటు ప్రధాన పట్టణాలకు కేటాయించారు. గత ఏడాది సంక్రాంతికి ముందు ఆర్టీసీ మొత్తం 2,982 ప్రత్యేక బస్సులను నడిపింది. సంక్రాంతి పండుగ ముగించుకుని తిరిగొచ్చే వారి కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులను కూడా నడుపుతోంది. జనవరి 15 నుంచి 17 వరకు 2,825 ప్రత్యేక బస్సులు నడపనుండగా.. వాటిలో హైదరాబాద్‌కు వెయ్యి, విశాఖపట్నంకు 200, విజయవాడకు 350, బెంగళూరుకు 200, చెన్నైకి 75, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు 1,000 ప్రత్యేక బస్సులను కేటాయించారు.

  Last Updated: 07 Jan 2022, 11:07 AM IST