ఏపీలోని చిత్తూరుజిల్లా పలమనేరు మండలం ఇందిరానగర్ లో విషాదం చోటుచేసుకుంది. తెల్లవారుజామున సుబ్రహ్మణ్యం అనే రైతు పొలానికి వెళ్లగా…అదే సమయంలో అటు వైపు నుంచి వస్తున్న ఏనుగుల గుంపు సుబ్రహ్మణ్యంను తొక్కి చంపేశాయి. అటవీ అధికారుల నిర్లక్ష్యం వల్లే సుబ్రహ్మణ్యం ఏనుగుల గుంపునకు బలయ్యాడని అతని బంధువులు, స్ధానికులు ఆందోళనకు దిగారు.
వారం రోజులుగా ఈ ప్రాంతంలో ఏనుగులు సంచరిస్తున్నా అటవీశాఖ అధికారులు చొరవచూపడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిణామాలు ఇంతకుముందుఎన్నో జరిగాయని…అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. కలెక్టర్ వచ్చేంతవరకు తమ ధర్నా కొనసాగుతుందని రహదారిపై భైఠాయించి నిరసన తెలిపారు.