Andhra Pradesh: చిత్తూరు జిల్లాలో ఆడ ఏనుగు విద్యుదాఘాతానికి గురై మృతి చెందింది. చిత్తూరు జిల్లా నల్లగండ్లపల్లి గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున 16 ఏళ్ల ఆడ ఏనుగు సంచరిస్తున్న సమయంలో విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టింది. చీకటి కావడంతో కనిపించని కారణంగా ఆ ఏనుగు బలంగా తగలడంతో విద్యుత్ స్థంభం నేలకొరిగింది. ఈ క్రమంలో విద్యుత్ తీగలు సదరు ఏనుగుకి తగలడంతో విద్యుదాఘాతానికి గురై మృతి చెందింది. ఈ విషయాన్నీ అటవీశాఖ అధికారులు తెలిపారు. ఈ ఘటన తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో జరిగింది.
నిజానికి ఇలాంటి ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో ఏనుగుల సంచారం ఉండే ప్రదేశాల్లో రాత్రి సమయంలో విద్యుత్ను నిలిపివేయాలని, అలాగే విద్యుత్ తీగలను వదులుగా ఉంచవద్దని అటవీ శాఖ విద్యుత్ శాఖకు సూచించింది. కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. కాగా చనిపోయిన ఏనుగుకి పోస్టుమార్టం చేసి దహనం చేస్తామని, వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు విద్యుత్ శాఖపై అటవీ శాఖ కేసు నమోదు చేస్తుందని ఉన్నతస్థాయి అధికారి తెలిపారు.