ఈశాన్య రాష్ట్రం త్రిపుర (Tripura)లో ఘోర విషాదం చోటు చేసుకుంది. ఉనకోటి జిల్లా (Unakoti district)లో కుమార్ఘాట్ వద్ద అల్టో రథయాత్ర (Ulto Rath yatra) లో ఆరుగురు మృతి చెందారు. రథయాత్ర సందర్భంగా రథంపైభాగానికి హైటెన్షన్ విద్యుత్ లైన్ వైర్లు తగలడంతో విద్యుదాఘానికి గురై ఆరుగురు మరణించారు. వీరిలో ఇద్దరు చిన్నారులుకూడా ఉన్నారు. ఈ ఘటనలో మరో 30మంది గాయాలయ్యాయి. బాధితులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో ఆరుగురి పరిస్థితి విషంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. మృతులంతా ఇస్కాన్ భక్తులు(ISKCON devotees). ఏడు రోజుల తరువాత జగన్నాథుడు తన మందిరానికి తిరిగి వచ్చిన పండుగ సందర్భంగా రథంతో నడుస్తున్నారని స్థానిక ఎమ్మెల్యే భగబన్ చంద్ర దాస్ చెప్పారు .
విద్యుదాఘాతంతో జరిగిన ప్రమాదంలో మృతుల్లో ఇద్దరు చిన్నారులు, ముగ్గురు మహిళలు, ఒక పరుషుడు ఉన్నారు. ఘటనపై ముఖ్యమంత్రి డాక్టర్ మాణిక్ సాహా విచారం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా పోస్టులో.. ఈరోజు రథయాత్ర సమయంలో జరిగిన విషాదంలో భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘటనతో నేను చాలా బాధపడ్డాను. మృతుల కుటుంబాలకు నా ప్రగాడ సానుభూతిని తెలియజేస్తున్నాను. గాయపడిన వ్యక్తులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. విషాదంలో ఉన్న కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం తెలిపారు.