హైదరాబాద్ విమానాశ్రయంలో 50 కోట్ల రూపాయల విలువైన ఐదు కిలోల కొకైన్ను డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI)అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఓ ప్రయాణికుడి నుంచి నార్కోటిక్ డ్రగ్ ఉన్నట్లు నిఘా వర్గాలకు సమాచారం అందింది. దీంతో అనుమానం వచ్చిన ప్రయాణికుడిని తనిఖీ చేయగా.. బ్రౌన్ టేప్లో చుట్టబడిన నిషిద్ధ వస్తువును సూట్కేస్ లో దాచి ఉండటాన్ని అధికారులు గుర్తించారు. మొత్తం ఐదు కిలోల కొకైన్ విలువ సుమారు రూ. 50 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. ప్రయాణికుడు లావోస్ నుండి సింగపూర్ మీదుగా హైదరాబాద్కు ప్రయాణించి ఢిల్లీకి వెళ్తున్నాడని అధికారులు తెలిపారు.