ప్రమాణస్వీకారం అనంతరం జాతినుద్దేశించి రాష్ట్రపతి ముర్ము తొలి ప్రసంగం చేశారు. దేశ అత్యున్నత పదవికి ఎన్నిక చేసినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజలు తన మీద పెట్టుకున్న విశ్వాసాన్ని నిలబెట్టుకుంటానని ధీమా వ్యక్తం చేశారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ ఉత్సవాల వేళ రాష్ట్రపతి బాధ్యతలు చేపట్టడం సంతోషంగా ఉంది అని ముర్ము అన్నారు. ‘‘ఓ ఆదివాసీ గ్రామంలో పుట్టిన నేను రాష్ట్రపతి భవన్ వరకు రావడం నా వ్యక్తిగత విజయం మాత్రమే కాదు.. దేశ పేద ప్రజలందరికీ దక్కిన విజయం అని ఈ సందర్భంగా అన్నారు. ఈ దేశంలో పేదలు కూడా తమ కలలను సాకారం చేసుకోవచ్చని చెప్పేందుకు నా నామినేషనే ఓ రుజువు అని ముర్ము అన్నారు.
50 ఏళ్ల స్వాతంత్ర్య వేడుకల వేళ నా రాజకీయ జీవితం ప్రారంభమైందనీ, 75 ఏళ్ల ఉత్సవాల వేళ ప్రథమ పీఠానికి ఎన్నిక కావడం గౌరవంగా భావిస్తున్నా అని ముర్ము పేర్కొన్నారు. స్వతంత్ర భారతంలో పుట్టి రాష్ట్రపతి పదవి చేపట్టిన తొలి వ్యక్తిని అని, స్వాతంత్ర్య సమరయోధుల కలలుగన్న సుస్వరాజ్య నిర్మాణం కోసం మరింత వేగంగా పనిచేయాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. అందరి సహకారంతో ఉజ్వల యాత్ర కొనసాగించాల్సి ఉంది అని ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతినుద్దేశించి మాట్లాడారు.