Manne Krishank: భారత రాష్ట్ర సమితి నాయకులు మన్నె క్రిశాంక్ సీఎం రేవంత్ కు బహిరంగ లేఖ రాశారు. ”మంత్రి జూపల్లి కృష్ణారావు ఎలాంటి మద్యం కంపెనీలు తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా వ్యాపారం చేయడానికి ప్రతిపాదనలు పెట్టలేదని చెప్పి ఎవరన్నా అలాంటి వార్తలు రాస్తే 100 కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేస్తారని హెచ్చరించారు. బీఆర్ఎస్ 27 మే 2024న మంత్రి జూపల్లి కృష్ణారావు గారి అబద్ధాన్ని బహిర్గతం చేస్తూ సోం డిస్తలరీస్ అనే సంస్థకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వడంపై మీడియా సమావేశం పెట్టిన అనంతరం జూపల్లి కృష్ణారావు నిజాన్ని ఒప్పుకొని Som Distilleries కు అనుమతులు ఇవ్వడం వాస్తవం. కానీ దానిపై మంత్రికి ఎలాంటి సమాచారం లేదు. అది బేవరేజెస్ కార్పొరేషన్ సొంత నిర్ణయం అని బాధ్యత రహితంగా పత్రికా ప్రకటన ద్వారా ప్రకటించారు” అని అన్నారు.
”Som Distilleries సంస్థ రాష్ట్ర ఖజానా కు గండికొడుతూ , ప్రభుత్వ సంస్థల వద్ద రుణాలను తీసుకొని ఎగ్గొడుతూ , కల్తీ మద్యం వ్యాపారం చేయడంలో ప్రఖ్యాతిగాంచింది . ఈ బహిరంగ లేఖలో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వారి కల్తీ బీరును ధ్వంసం చేసే చిత్రాన్ని కూడా జతపరిచినాము. కెసిఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలాంటి కల్తీ మద్యం లేకుండా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడారు. దయచేసి కమిషన్ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం నకిలీ బీరును తయారు చేసే కంపెనీలకు అనుమతులు ఇచ్చి ఆరోగ్యానికి హానికరమైన కల్తీ మద్యాన్ని రాష్ట్రంలో అందుబాటు లోకి తేవ వద్దని మనవి” అని బీఆర్ ఎస్ నేత అన్నారు.