2BHK Houses:పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణ పనులు త్వరితగతిన సాగుతున్నాయి. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు లబ్దిదారులకు ఇళ్లను అందించేందుకు పనులు ముమ్మరం చేస్తున్నారు. ఒక్క నగర పరిధిలోనే లక్ష ఇళ్లను కట్టి లబ్దిదారులను ఇవ్వాలన్న సంకల్పం పెట్టుకున్నారు. అందులో భాగంగా ఇప్పటికే 70000 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తయింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ బల్దియా పరిధిలో 2BHK ఇళ్ల పంపిణీ సెప్టెంబర్ 2న ప్రారంభం కానుంది. ఈ ఇళ్లకు లబ్ధిదారులను డ్రా ద్వారా ఎంపిక చేస్తారు.
పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన శనివారం జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. సమావేశంలో జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, మేడ్చల్-మల్కాజ్గిరి కలెక్టర్ హరీశ్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమయ్కుమార్, జీహెచ్ఎంసీ హౌసింగ్ ఓఎస్డీ సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్లు తమ పరిధిలోని లబ్ధిదారులకు 2బీహెచ్కే ఇళ్ల పంపిణీని సమన్వయం చేయాలని మంత్రి ఆదేశించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ సెప్టెంబర్ 2న ఎనిమిది ప్రదేశాలలో జరుగుతుంది. మొదటి దశలో 12,000 మంది లబ్ధిదారులకు ఇళ్లను పంపిణీ చేస్తారు. పంపిణీ ప్రక్రియలో పారదర్శకతను నిర్ధారించడానికి, ఆగస్టు 24న హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ర్యాండమైజేషన్ సాఫ్ట్వేర్ను ఉపయోగించే డ్రా ద్వారా లబ్ధిదారుల ఎంపిక జరుగుతుంది.
అంతకుముందు ప్రగతి భవన్లో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల బాధ్యులతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. హైదరాబాద్తోపాటు ఇతర జిల్లాల్లో ఆరు దశల్లో 70,000 2బిహెచ్కె ఇళ్లను పంపిణీ చేయాలని సమావేశంలో ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో పేదలకు లక్ష 2బీహెచ్కే ఇళ్లను నిర్మించాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని కేటీఆర్ నొక్కి చెప్పారు. వీటిలో ఇప్పటికే 75 వేల ఇళ్లను నిర్మించారు. ఈ లెక్కన హైదరాబాద్ మరియు ఇతర జిల్లాల్లో 5,000 2BHK గృహాలు ఇప్పటికే పంపిణీ చేశారు.
Also Read: Railway Recruitment 2023: రైల్వే శాఖలో ఉద్యోగం కోసం చూస్తున్నారా.. అయితే ఇలా అప్లై చేసేయండి..!