ప్రస్తుత రోజుల్లో చిన్న పెద్ద అని తేడా లేకుండా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. మరి ముఖ్యంగా మధుమేహంతో బాధపడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. భారతదేశంలో దాదాపుగా 11.4 శాతం మంది జనాభా ఈ మధుమేహం బారిన పడ్డారు. ఇదే విషయం తాజాగా ది లాన్సెట్ డయాబెటిస్ అండ్ ఎండోక్రైనాలాజీ జనరల్ నివేదికలో వెళ్లడైంది. అలాగే.. 35.5 శాతం ప్రజలు అధిక రక్తపోటుతో బాధపడుతున్నట్లు తేలింది.
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ తో కలిసి మద్రాస్ డయాబెటిస్ రీసెర్చ్ ఫౌండేషన్ ఈ అధ్యయనం చేసింది. 2008 – 2020 మధ్య దేశవ్యాప్తంగా 1.1లక్షల మందిపై సర్వే నిర్వహించి నివేదిక రూపొందించింది. అన్ని రాష్ట్రాల్లో జనాభా, భౌగోళిక పరిస్థితులు, సామాజిక ఆర్థిక స్థితిగతులను పరిగణనలోకి తీసుకొని దశలవారీగా పరిశోధకులు అధ్యయనం చేయగా, ఈ నివేదికలో దేశ జనాభాలో 15.3 శాతం ప్రజలు ఫ్రీ డయాబెటిస్ స్థితికి చేరారని, 28.6 శాతం మంది ప్రజలు సాధారణ ఊబకాయం, 39.5శాతం ప్రజలు ఉదర సంబంధిత ఊబకాయం సమస్యతో బాధపడుతున్నట్లు నివేదికలో పేర్కొన్నారు.
81.2 శాతం ప్రజల్లో డిస్లిపిడేమియా ఉందని ఇది నిజంగా ఆందోళనకర విషయమని పరిశోధకులు తెలిపారు. దేశంలో మధుమేహం.. ఇతర సంక్రమించని వ్యాధుల బాధితుల సంఖ్య గతంలో అంచనా వేసిన దానికన్నా ఎక్కువగా ఉంది. అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో ఈ సంఖ్య స్థిరంగా ఉన్నా.. చాలా రాష్ట్రాల్లో పెరుగుతోంది. ఈ ఆరోగ్య సమస్యలు ప్రమాదకరస్థాయికి చేరుతున్నందున వెంటనే అన్ని రాష్ట్రాలు తగిన ఆరోగ్య విధానాలు అమల్లోకి తీసుకురావాలి అని పరిశోధకులు సూచిస్తున్నారు.